26న పెళ్లి, 27న రిసిప్షన్, 28న నవ వధువు మృతి, ఏం జరిగింది?

శనివారం, 29 మే 2021 (16:51 IST)
తాజాగా పెళ్లై ఇంట్లో సంతోషంగా తిరగాల్సిన నవ వధువు ఒక్కరోజులోనే డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. కుటుంబం మొత్తం పెళ్లి చేసామని సంబురపడే లోపే వారి ఆశలపై నీళ్లు చల్లింది.
కూతురుకు పెళ్లి చేస్తే సుఖపడుతుందనుకున్న తల్లిదండ్రుల జీవితాల్లో విషాదం నింపింది.

ఇరవై ఒక్క సంవత్సరాలు తమ గుండెలపై పెరిగిన ఆడపిల్ల పెళ్లైన తెల్లారే తమని కాదని తనువు చాలించింది. కారణాలు చెప్పకుండానే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణ పురంలోని మర్రిబావి తండాకు చెందిన అనుషా అనే 21 సంవత్సరాల యువతికి ఈనెల 26న సమీపంలోని పెద్దపురం తండాకు చెందిన మధు అనే యువకుడితో వివాహం జరిగింది.
 
తల్లిదండ్రులు అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. అనంతరం 27వ తేదిన పెద్దపురంలో పెళ్లి కొడుకు ఇంటి వద్ద రిసెప్షన్ జరిగింది. అదే రోజు రాత్రి భార్యభర్తలు ఇద్దరు కలిసి మర్రిబావి తండాలోని తల్లిగారి ఇంటికి చేరుకున్నారు.
 
అంతా బాగానే ఉందనుకున్న సమయంలో అనుషా 28 మధ్యాహ్నం తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. అలసటతో రెస్ట్ తీసుకుంటుందని అంతా భావించారు. సాయంత్రం అయినా బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు తలుపులు తీసి గదిలోకి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది అనుష.

దీంతో తల్లిదండ్రులు వెంటనే కిందికి దించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. శవాన్ని పోస్టు మార్టంకు పంపించారు పోలీసులు. అయితే యువతి పెళ్లి మరునాడే ఆత్మహత్యకు పాల్పడిన కారణాలు మాత్రం తెలియరాలేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు