మద్యం దుకాణాలను మూసి వేస్తున్న తెలంగాణ సర్కారు.. ఎందుకు?

శుక్రవారం, 26 మార్చి 2021 (11:26 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక రోజంతా మద్యం దుకాణాలను మూసివేయనుంది. ఈ నెల 28వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి 30వ తేదీ ఉదయం 6 గంటల వరకూ మద్యం షాపులను మూసివేయాలని తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. 
 
మద్యం షాపులతో పాటు కల్లు దుకాణాలకు కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని అధికారులు పేర్కొన్నారు. రిజిస్టర్డ్ క్లబ్‌లు, స్టార్ హోటళ్లకు మాత్రం మినహాయింపు ఉంటుందని తెలిపారు. 
 
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా, రహదారులపై బహిరంగంగా హోలీ వేడుకలు చేసుకోవడం, పబ్లిక్ ప్లేసుల్లో రంగులు చల్లుకోవడాన్ని నిషేధిస్తున్నట్టు ఇప్పటికే పోలీసు విభాగం ఆదేశాలు జారీ చేసింది.
 
హోలీ రోజున ద్విచక్ర వాహనాలపై వేగంగా వెళుతూ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించినా, ఇతరులకు ఇబ్బందులు కలిగించినా కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ హెచ్చరించారు.
 
నిబంధనలను మీరిన వారిపై కేసులను నమోదు చేస్తామని అన్నారు. హోలీ పండగను ప్రశాంతంగా ఇళ్లలోనే నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. కాగా, కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు