బెంగళూరులో "జాతీయ కార్టూనిస్టుల సమ్మేళనం"

"ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్టు"ల సంస్థ నిర్వహణలో మే నెల 18వ తేదీన జాతీయ కార్టూనిస్టుల సమ్మేళనం బెంగళూరు నగరంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు నరేంద్ర వెల్లడించారు.

ఈ విషయమై నరేంద్ర, బెంగళూరులోని ప్రెస్‌క్లబ్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... సమ్మేళనం సందర్భంగా ఎంపిక చేసిన ఏడుగురు ప్రముఖ కార్టూనిస్టులను "లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్" అవార్డులతో సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఇదే సందర్భంగా బెంగళూరు నగరంలో ఇండియన్ కార్టూన్ గ్యాలరీ స్థాపనకు సహకరించిన నైస్ ఎమ్.డీ. అశోక్ ఖేణిని కూడా సత్కరించనున్నట్లు ఆయన చెప్పారు.

కాగా, అవార్డులకు ఎంపికైన వారిలో ఉన్ని (ఇండియన్ ఎక్స్‌ప్రెస్), ఉత్తరప్రదేశ్ గాజియాబాద్‌కు చెందిన కాక్, ముంబైకి చెందిన వసంత సర్వటే, ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన వెంకట్రావ్, కర్ణాటకకు చెందిన ప్రభాకర్ రావు బెల్, కేరళకు చెందిన థామస్, తమిళనాడుకు చెందిన మదన్‌లు ఉన్నట్లు నరేంద్ర తెలిపారు.

అలాగే... ప్రముఖ కార్టూనిస్ట్ దివంగత మాయా కామత్ మెమోరియల్ పేరుతో జరుపుతున్న వ్యంగ్య చిత్ర పోటీలలో... జాతీయ స్థాయిలో వచ్చిన 64 కార్టూన్లలో న్యాయ నిర్ణేతలు ఐదింటిని ఎంపిక చేసినట్లు నరేంద్ర వివరించారు. అందులో మొదటి బహుమతి ఔట్‌లుక్‌కు చెందిన సందీప్ అధ్వర్యు, రెండవ బహుమతి కర్ణాటకకు చెందిన రామ్ ధ్యాని, మూడో బహుమతి తెలుగు దినపత్రిక సాక్షి కార్టూనిస్ట్ శంకర్‌లను ఎంపిక చెసినట్లు ఆయన చెప్పారు.

ఇదిలా ఉంటే... జాతీయ స్థాయి వ్యంగ్య చిత్ర కళాకారుల శిక్షణా శిబిరాన్ని కూడా తమ సంస్థ, మే 18 నుంచి మూడు రోజులపాటు బెంగళూరు నగరంలోని కార్టూన్ గ్యాలరీలో నిర్వహించనున్నట్లు నరేంద్ర తెలియజేశారు. ఇందులో పాల్గొనేందుకు 10వ తరగతి వరకు చదివిన ఔత్సాహిక వ్యంగ్య చిత్రకారులు దరఖాస్తు చేసుకోవచ్చునని అన్నారు. ఎంపికైన వ్యంగ్య చిత్రకారులకు రాజకీయ, సామాజిక అంశాలపై కార్టూన్ల గురించిన శిక్షణ ఇవ్వనున్నట్లు నరేంద్ర వివరాలందించారు.

వెబ్దునియా పై చదవండి