వడ్డనకు సిద్ధమవుతున్న "ఆవకాయ్ బిర్యాని"

అమిగోస్ క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల నిర్మిస్తున్న చిత్రం "ఆవకాయ్ బిర్యాని". ఈ సినిమా ద్వారా కమ్ముల శిష్యుడు, స్నేహితుడు అనీష్ కురువిల్లా దర్శకునిగా పరిచయమవుతున్నారు.

కమల్ కామరాజు, బిందు మాధవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల ప్రథమార్థంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఫైనల్ మిక్సింగ్ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ఆర్.కె. నారాయణ "మాల్గుడి కథలు" తరహా కథ ఉంటుందని, చిత్రం ఆద్యంతం గ్రామీణ వాతావరణంలో రూపుదిద్దుకుందని నిర్మాత తెలిపారు.

తన స్టైల్లో కాకుండా అనీష్ శైలిలో కథనం ఉంటుందని, తన తొలి సినిమా మొదలుకొని తనతో పనిచేస్తూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న అనీష్ చెప్పిన కథ నచ్చడంతో సొంతంగా నిర్మిస్తున్నామని కమ్ముల అన్నారు.

మణికాంత్ ఖాద్రి వినసొంపైన సంగీతం అందించారని, అందుకు తగ్గట్టు వనమాలి సాహిత్యం ఆకట్టుకుంటుందని దర్శకుడు అనీష్ చెప్పారు. సెవెన్ సీటర్ నడిపే ఆటో డ్రైవర్‌కూ, పచ్చళ్లు అమ్ముకునే అమ్మాయికీ నడుమ నడిచే ప్రేమ కథే "ఆవకాయ్ బిర్యానీ" అని దర్శకుడు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి