అల్లు శిరీష్ అమ్మాయితో వివాదం.. అసలేం జరిగింది?

FILE
అల్లు శిరీష్ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడంటూ వార్తలొస్తున్నాయి. ఎక్కడ చూసినా సినీ సర్కిల్స్‌లో ఇదే టాక్. ఈ వివాదం.. ఎలా జరిగింది.. అసలేం జరిగింది.. అనేది ఆరాతీస్తే.. జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో అర్ధరాత్రి ముగ్గురు యువకులు తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఓ మహిళా ఫోటోగ్రాఫర్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ముగ్గురిలో ఒకరు నిర్మాత అల్లు అరవింద్‌ కొడుకు అల్లు శిరీష్‌ అనే ఆరోపణలు వినిపిస్తుండడంతో ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది.

పోలీసులు, విశ్వసనీయవర్గాల కథనం మేరకు.. ఢిల్లీకి చెందిన తేజల్‌ పరాన్‌ షా అనే ఫోటోగ్రాఫర్‌ బ్రిటన్‌కు చెందిన మహిళా డీజే ఫైజా బబుల్‌తో కలిసి జూబ్లీహిల్స్‌ దసపల్లా హోటల్‌లోని 'ఓవర్‌ ది మూన్‌' పబ్‌లో డీజేకు వచ్చారు. శనివారం రాత్రి ఫైజా సంగీతంతో హోరెత్తిస్తుండగా తేజల్‌ ఫొటోలు తీసుకుంటున్నారు.

అల్లు అరవింద్‌ కుమారులైన హీరో అర్జున్‌, అతడి సోదరులు వెంకట్‌, శిరీష్‌లు కుటుంబసభ్యులతో కలిసి అదే పబ్‌కు వచ్చారు. హోరెత్తుతున్న సంగీతానికి కుర్రకారు హుషారుగా వూగుతున్నారు. తేజల్‌ పదే పదే ఫోటోలు తీస్తుండటంతో అల్లు శిరీష్‌ ఆమెను హెచ్చరించినట్టు తెలిసింది.

ఈ సందర్భంలో ముగ్గురు యువకులు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. తర్వాత అర్జున్‌, శిరీష్‌లు పబ్‌ నుంచి వెళ్లిపోయారు. అసభ్యకరంగా ప్రవర్తించినవారు ఫలానావారని అక్కడున్న కొందరు తేజల్‌కు చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

అప్పటికి అక్కడే ఉన్న అల్లు వెంకట్‌ ఆమెను వారించినట్టు తెలిసింది. అయినా తేజల్‌ వినలేదు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో నేరుగా జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఆమె ముగ్గురిపై ఫిర్యాదు చేశారు.

వెబ్దునియా పై చదవండి