జయసుధ, సలోని లక్ష్మీరాయ్‌లతో బాలయ్య రొమాన్స్!

సోమవారం, 12 డిశెంబరు 2011 (12:50 IST)
FILE
2010లో 'సింహా', 2011లో 'శ్రీరామరాజ్యం'... మొదటి సినిమా వసూళ్ల వర్షం, రెండవ సినిమా ప్రశంసల వర్షం. ఓ పక్క కుర్రహీరోలతో పోటీపడుతూ, మరోపక్క తన స్థాయికి తగ్గ పాత్రలను పోషిస్తూ తనకు తానే సాటి అనిపించుకుంటున్నారు నందమూరి బాలకృష్ణ. ఇప్పటికే 'సింహా'తో తన ఖాతాలో రెండవ 'నంది'ని సొంతం చేసుకున్నారాయన.

2011లో కూడా బాలయ్యే 'ఉత్తమనటుడు' అని చాలామంది అభిప్రాయం కూడా. ఇదిలా ఉంటే... 2012లో శ్రీకీర్తి కంబైన్స్‌వారి చిత్రంతో ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇందులో ఆయన త్రిపాత్రాభినయం చేయడం విశేషం. పరుచూరి మురళి దర్శకత్వంలో ఎమ్. ఎల్ కుమార్‌చౌదరి నిర్మిస్తోన్న ఈ చిత్రం ఆరు పాటలతో ఈ నెల చివరి వారంలో విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు.

కళ్యాణిమాలిక్ అద్భుతమైన సంగీతం అందించారని, ముఖ్యంగా ఆయన అందించిన నేపథ్య సంగీతం చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని తెలిపారు.

ఇంకా చెబుతూ.. బాలకృష్ణ ఇందులో తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నారు. తాతగా, తండ్రి, తనయుడిగా ఒకదానితో ఒకటి పొంతనలేని పాత్రల్లో ఆయన కనిపిస్తారు.

జయసుధ, సలోని, లక్ష్మీరాయ్ ఆయన సరసన నటిస్తున్నారు. నటుడిగా ఆయన్ను మరింత ఎత్తుకు తీసుకెళ్తుంది ఈ సినిమా అని ఆయన చెప్పారు. బాలయయ్ సినిమా సరైన విజయాన్ని అందుకుంటే... దానిప్రభావం ఏస్థాయిలో ఉంటుందో ఇప్పటికే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహా చిత్రాలు నిరూపించాయి.

వాటిని మించే ఈ విధంగా ఈ సినిమా ఉంటుందని నమ్మకంతో చెప్పగలను. పరుచూరి మురళి అంత అద్భుతంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. జనవరిలో చిత్రాన్ని విడుదల చేస్తాం అని చెప్పారు.

కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్‌రాజ్, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, ఆదిత్యమీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సందీప్.

వెబ్దునియా పై చదవండి