భీమవరం నుంచి వచ్చిన సినీ బుల్లోడు సునీల్ సినిమా తీసేసి రిలీజ్కు సిద్ధంగా ఉన్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ చేసిన ఈ సినిమా చాలాకాలం గ్యాప్ తర్వాత ఉదయశంకర్ దర్శకత్వం వహించారు. సినిమా అయితే పూర్తిచేశారు కానీ విడుదలకు అవాంతరాలు వచ్చిపడుతున్నాయి. సంక్రాంతికి పెద్ద సినిమాల్లో నలిగిపోతుందనుకుని వాయిదా వేశారు.
కానీ అప్పుడే రిలీజ్ చేస్తే బాగుండేదేమోనని ఆ తర్వాత గ్రహించారు. ఇప్పుడు అటుఇటుగా మార్చి ఈ నెల 14న విడుదల చేయాలనుకున్నారు. అయితే రాష్ట్ర పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉండకపోవచ్చని వార్తలు రావడంతో 14న అనుమానంగా ఉంది. సీమాంద్ర జెఎసి ఆధ్వర్యంలో మళ్ళీ బంద్లు వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి.
ఇప్పటికే గత రెండురోజులుగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు మూయిస్తూ హడావుడి చేస్తన్నారు. కేంద్రంలో తెలంగాణా బిల్లుకు అనుకూలంగా పవనాలు వీయడంతో తాము మరింత ఉధృతంగా ఉద్యమాలు చేస్తామని శేఖర్ బాబు చెప్పడంతో సినిమా విడుదలపై మేఘాలు కమ్ముకున్నాయి.
కాగా, ఈ విషయంలో డి.సురేష్బాబు మాత్రం నమ్మకంగా ఉన్నారు. ప్రజలు మా సినిమాకు ఎటువంటి అవరోధాలు కల్పించరని అనుకుంటున్నట్లు సురేష్ అన్నారు. మరికొద్ది రోజులు ఏమవుతుందో చూడాలి.