కమెడియన్గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సునీల్ ఇపుడు హీరోగా మారి అంతగా నవ్వించలేకపోతున్నాడు. ప్రేక్షకులు ఎలాంటి విషయాలకు నవ్వుతారో జడ్జ్ చేయడంలో సునీల్ ఇపుడు పూర్తిగా విఫలమవుతున్నట్టు కనిపిస్తున్నాడు.
తాజాగా సునీల్ నటించిన 'భీమవరం బుల్లోడు'లో ఈ విషయం అర్థమవుతోంది. సినిమా గురించి సునీల్ మామూలుగా చెప్పలేదు. ''టైటిల్స్ దగ్గర్నుంచి చివరి వరకు నవ్వుతూనే ఉంటారండీ, ఇంటికొచ్చాక కూడా ఆ నవ్వు ఆపరండీ. ఈ సినిమా చూశాక మీరు అనుకొన్న స్థాయిలో నవ్వకపోతే నా సినిమాలు చూడడం ఆపేయండీ" అంటూ సెలవిచ్చాడు. కట్ చేస్తే సినిమా 1980 సరుకుతో ప్రేక్షకుల ముందుకొచ్చిందని అర్థమైంది. ఏ సన్నివేశంలోనూ నవ్వు సహజంగా రాదు. బలవంతంగా నవ్వాల్సి వస్తుంటుంది.
ఇలాంటి సినిమా గురించి కూడా సునీల్ ఆహా ఓహో... అంటూ భుజానికెత్తుకోవడం వెనక ఆయన కన్ఫ్యూజన్ ఉందని అర్థమవుతోంది. సినీ విశ్లేషకులు కూడా అదే తేలుస్తున్నారు. సగం హీరోయిజమ్, సగం కామెడీపై దృష్టిపెడితే ఇలాగే ఉంటుందనీ... సునీల్ పూర్తి స్థాయిలో కామెడీపై దృష్టిపెట్టి సినిమా చేస్తేనే ఫలితం దక్కుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.