"యంగ్ ఇండియా"కి స్క్రిప్ట్ నేనే రాసుకున్నా..!: దాసరి

WD
చాలాకాలం తర్వాత అంటే.. "స్వర్గం-నరకం" తర్వాత మళ్ళీ తాను తీసే చిత్రకథకు తానే స్క్రిప్ట్ రాసుకున్నానని దర్శకరత్న దాసరి నారాయణ రావు అన్నారు.

అప్పుడు అసిస్టెంట్ డైరక్టర్లు ఉండేవారు. తాను చెబితే రికార్డు చేసేవారు. కానీ ఈసారి మాత్రం తానే స్వయంగా స్క్రిప్ట్ రాసుకున్నానని ఆయన చెప్పారు.

"యంగ్ ఇండియా" పేరుతో దాసరి ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర విశేషాలను ఆయన తెలియజేస్తూ.. ఇందులో అందరూ కొత్తవారే నటిస్తారు. అందులో ఏ మాత్రం సందేహం లేదని చెప్పారు. ఇతరుల వలె చెప్పేదొకటి వేరొకటి చేయడం తన తత్త్వంకాదని దాసరి స్పష్టం చేశారు.

కొత్తవారిని తీసుకుంటున్నామని, నిర్మాత కొడుకునే, హీరో కొడుకునే తీసుకునే దౌర్భాగ్యం తనకు పట్టలేదని, ఇండస్ట్రీకి కొత్త ప్రతిభగల వారిని తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నానని దాసరి పేర్కొన్నారు.

నాలుగు హీరోలు, 4 హీరోయిన్లతో పాటు 60మంది క్యారెక్టర్ ఆర్టిస్టులను ఎంపికచేయబోతున్నామని, ఇటీవలే ఇచ్చిన ప్రకటనలకు అనూహ్య స్పందన వచ్చిందని దర్శకరత్న వెల్లడించారు. మొత్తం 15000 దరఖాస్తులు అందాయని, ఇంకా నాలుగు బస్తాల అప్లికేషన్లు ఉన్నాయని ఆయన తెలియజేశారు.

అయినా వాటినన్నింటిని ఓపిగ్గా చూడదలచుకున్నామని, కొంతమంది గడువు మరీ తక్కువగా ఉందంటున్నారు. అందుకే సెప్టెంబర్ 7వరకు గడువును పొడిగించామని గురువారం దాసరి మీడియాతో చెప్పారు.

వెబ్దునియా పై చదవండి