ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన "అడవి" చిత్రాన్ని తెలుగులో నిర్మించిన నిర్మాత నట్టికుమార్, వర్మ తదుపరి చిత్రమైన "రక్తచరిత్ర"ను కూడా తానే తెలుగులోకి అనువదిస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ పదోతేదీన ఈ చిత్రం షూటింగ్ లాంఛనంగా ప్రారంభమవుతుందని నట్టి కుమార్ అన్నారు.
ఇప్పటికే మహిళా సంఘాలకు వర్మ "రక్తచరిత్ర"పై కన్ను పడిందని, దీనికి ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని ఆ సంఘాలు స్టేట్మెంట్ ఇవ్వడం హేయమైందని నిర్మాత వెల్లడించారు.
ఇప్పటికే విడుదలై థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోన్న వర్మ "అడవి" కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని నట్టి కుమార్ అన్నారు. "అడవి" విడుదలైన తొలిరోజే 1.60 లక్షలు, 2వరోజు 1.22, 3వరోజు 1.62 లక్షలు వసూలు చేసిందని నిర్మాత తెలియజేశారు.
చిరుతనయుడు రామ్చరణ్ తేజ "మగధీర" వంటి సెస్సేషనల్ సినిమా నడుస్తున్న సమయంలోనే తమ "అడవి" చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి, కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారని నట్టికుమార్ అన్నారు.
నితిన్ హీరోగా వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 205 సెంటర్లలో విడుదల చేసి రికార్డు సృష్టించామని ఆయన వెల్లడించారు.
వైజాగ్లో 7 థియేటర్లు, విజయవాడలో 5, గుంటూరు 2, రాజమండ్రి, ఈస్ట్గోదావరి తదితర ప్రాంతాల్లో రెండేసి థియేటర్లలో విడుదలచేస్తే అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయన్నారు.
ఈ క్రెడిట్ అంతా రామ్గోపాల్వర్మకే దక్కుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో సోమవారం నాటికి అడవి దాదాపు 4కోట్లుదాకా వసూలు చేసిందని, నితిన్ సినిమాల్లో ఇది గ్రేట్ అని నిర్మాత చెప్పారు.
మరోవైపు కొన్ని మహిళా సంఘాలు "అడవి" చిత్రాన్ని బ్యాన్ చేయాలని గొడవలు చేయడం, సంథ్య థియేటర్లో వినాయిల్ను చింపేయడం వంటి చర్యలకు పాల్పడడం పట్ల నిర్మాత ఆక్షేపణ వ్యక్తం చేశారు.
సినిమా చూడకుండా గొడవచేయడం సరైందికాదని, యు/ఎ సెన్సార్ సర్టిఫికేట్ పొందిన "అడవి" చిత్రాన్ని బ్యాన్ చేయాలనడం వారి అపోహలకు తార్కాణమని పేర్కొన్నారు.
మగధీర, బిల్లా వంటి చిత్రాల్లో లేని అసభ్యత ఈ చిత్రంలోనే ఎందుకు కన్పించిందని నట్టికుమార్ ప్రశ్నించారు. ఇదంతా ఇండస్ట్రీలోని ఓ వ్యక్తి కావాలనే చేయిస్తున్నారని తెలిసిందని, త్వరలో ఆయన పేరు కూడా బయటపెడతామని అన్నారు.
అడవి చిత్రంపై అభ్యంతరం చెప్పేవారికి బహిరంగంగా ఆ సినిమాను ప్రదర్శిస్తామని, సినిమాను చూడకుండా మహిళా సంఘాలు గొడవచేయడం దురదృష్టకరమని ఆయన చెప్పారు.