రమణ పిలుపుతోనే బాపు వెళ్లినట్లున్నారు.. బాలకృష్ణ అశ్రునివాళి

సోమవారం, 1 సెప్టెంబరు 2014 (15:46 IST)
తన ప్రాణ స్నేహితుడు రమణ పిలవడం వల్లే దర్శక దిగ్గజం బాపు పరలోకేగినట్టుగా ఉన్నారంటూ సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. చెన్నైలో కన్నుమూసిన బాపు భౌతికకాయానికి ఆయన సోమవారం అశ్రునివాళి అర్పించారు. బాపు పార్థీవదేహం వద్ద బాలకృష్ణ కన్నీటి పర్యంతమయ్యారు. 
 
ఆ తర్వాత బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. బాపు లేరన్న విషయాన్ని జీర్చించుకోలేక పోతున్నట్టు చెప్పారు. బాలకృష్ణ భావోద్వేగాన్ని ఆపుకోలేక కంటతడి పెట్టారు. బాపు అభిమానులు కాని తెలుగు వారు ఎవ్వరూ లేరన్నారు. తెలుగుదనాన్ని, తెలుగు సంప్రదాయాన్ని బాపు పదిలపరిచారని బాలకృష్ణ అన్నారు.
 
తోడు లేకుండా ఉండలేనని రమణ పిలిచినట్లు ఉన్నారని... అందుకే బాపూ వెళ్లిపోయారని బాలయ్య అన్నారు. బాపూలాంటివారికి మరణం లేదని, తెలుగు సంప్రదాయం బతికివున్నంత కాలం బాపు స్థిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. బాపూ సినిమా, చిత్రకళ తెలుగుదనానికి ప్రతీకగా ఆయన కొనియాడారు. ఆయన బొమ్మలేని తెలుగు లోగిలి కనిపించదన్నారు. శ్రీరామరాజ్యం సినిమాలో నటించటం తన అదృష్టమని బాలకృష్ణ అన్నారు. 

వెబ్దునియా పై చదవండి