ఎస్వి రంగారావు లెజెండ్ పర్సన్. ఆయనకు పద్మ పురస్కారాలు రాకపోవడం చాలా తప్పిదమని వక్తలు పేర్కొన్నారు. ఆంగ్ల నటులు కూడా 'నర్తనశాల' చిత్రాన్ని చూసి 'ఎవరీయన' అంటూ ఆశ్చర్యపోయి.. తమకంటే బాగా చేశారని ప్రశంసించారు. కానీ ఇవేవీ భారత ప్రభుత్వానికి పట్టలేదని.. దుయ్యబట్టారు. ఈ మాటలను దాసరి, ఆర్.నారాయణమూర్తి, కైకాల సత్యనారాయణరావు వంటి వారు అనడం విశేషం.
ఈ సందర్భంగా... ఈరోజు చరిత్ర మనకు చాలా అవసరం. చరిత్ర లేకపోతే కొన్నాళ్ళ తర్వాత మనం ఎవరమో ఎవరికీ తెలీదు. టి.వి. అనేది లేకపోతే ఎందరో మహానటులు కనుమరుగైపోయేవారు. దానికి ఉదాహరణ సీనియర్ నిర్మాత సి.కృష్ణవేణిగారు. కీలుగుర్రం, లక్ష్మమ్మ, మనదేశం వంటి పదిహేను సినిమాలకు ఆమె నిర్మాతనీ, ఆ తర్వాత నాతో తీసిన శ్రీవారి ముచ్చట్లు, రావణుడే రాముడైతే చిత్రాల నిర్మాత అని ఎంతమందికి తెలుసు. ఎన్.టి.రామారావుగారిని పరిచయం చేసింది ఎవరని అడిగితే ఎవరెవరి పేర్లో చెబుతారు. కానీ, ఆయన్ని పిలిపించి టెస్ట్ చేసి తన సినిమాలో బుక్ చేసిన మహాతల్లి కృష్ణవేణి. ఇది చరిత్రలో గుర్తు వుండదు.
ఎన్.టి.రామారావుగారినే కాదు, ఎస్.వి.రంగారావుగారిని, ఘంటసాలగారిని కూడా పరిచయం చేసింది కృష్ణవేణే. ఇలాంటి గొప్పవాళ్ళు ఎంతోమంది ఇండస్ట్రీలో వున్నారు. వారి జీవితచరిత్రలు రావాల్సిన అవసరం వుంది. ఎస్.వి.రంగారావుగారు నాకు దేవుడు. నా మొదటి సినిమా కథానాయకుడు. ఆయన కనుక ఆ పాత్ర వేసి వుండకపోతే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయి వుండేది కాదు.
ఇంత పెద్ద దర్శకుడ్ని అయ్యేవాడ్ని కాదు. తాత మనవడు చిత్రం కంటే ముందే బాగా పరిచయం. ఒక చంటిపిల్లాడి మనస్తత్వం. కోపం, తాపం నిముషమే. ఆయనతో వర్క్ చెయ్యడం చాలా హ్యాపీ. అలాంటి మహానటుడి గురించి పుస్తకం రాయడం ద్వారా, ఇక్కడికి పిలవడం ద్వారా మమ్మల్ని రీచార్జ్ చేశాడు అన్నారు.