సాంకేతిక రంగాల్లో రోజురోజుకు మారుతున్న అనేక టెక్నికల్ పెను విప్లవాల పుణ్యమా అని, ప్రపంచం మొత్తం ఓ చిన్న 'గ్లోబల్ విలేజ్'గా మారిపోతూ, లక్షల కోట్ల మైళ్ల దైరంలో ఉన్న అంగారకుడిపై కదలికలను సైతం నిల్చున్న చోటు నుంచే చూపిస్తున్న ఆధునిక యుగంలో.. ఓ సినిమా ఇండస్ట్రీ హైద్రాబాద్లోనో, ముంబయ్లోనో.. ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కాబట్టి విజయవాడలోనో, వైజాగ్లోనో ఇంకా అదేదో ఫలానా చోట ఉండాలని ఫిక్స్ అవ్వటం చాలా పాతకాలపు ఆలోచనలతో కూడిన మూర్ఖపు అవివేకం అంటున్నారు రాంగోపాల్ వర్మ. తన వాదనను ఇప్పుడు ఆయన ఆచరణ రూపంలో పెట్టబోతున్నారు.
'తెలంగాణ ఉద్యమ పురిటిగడ్డ' కరీంనగర్లో నవంబర్ 18న ఉదయం 11 గం||లకు శాతవాహన యూనివర్శిటీలోని ఒక బహిరంగ వేదిక ద్వారా- ఒక 'అవగాహన సదస్సు'ను ఏర్పాటు చేసి.. 'హైద్రాబాద్ సినిమా ఇండస్ట్రీలో పని చేసే ఒక్క వ్యక్తి కూడా తెలియకపోయినా, ఎలా కరీంనగర్లోనే ఓ సినిమా ఇండస్ట్రీ పెట్టుకొని మిగతా ప్రాంతాలతో ఏమాత్రం సంబంధాలు లేకుండా, ఎవరి ప్రమేయం లేకుండా కూడా సినిమాలు తీసి వాటిని ఎలా రిలీజ్ చెయ్యచ్చో ఈ రోజు వివరిస్తానని ఆర్జీవి చెబుతున్నారు.