'సలేశ్వరం' గొప్పదనం: శివుడు-అర్జునుడు యుద్ధం చేసింది...

సోమవారం, 22 డిశెంబరు 2014 (19:08 IST)
'సలేశ్వరం' గొప్పదనమేమిటో తెలుసుకోవాలా..? అయితే చదవండి. సలేశ్వరంలో శివార్జునుల పోరు జరిగిందని చెప్పబడుతోంది. పరమశివుడిని మెప్పించి ఆయన నుంచి అత్యంత శక్తిమంతమైన పాశుపతాస్త్రాన్ని పొందాలని అర్జునుడు నిర్ణయించుకుంటాడు. అనుకున్నదే తడవుగా అందుకు తగిన ప్రదేశాన్ని ఎంచుకున్న అర్జునుడు తపస్సు చేయసాగాడు. 
 
అయితే పాశుపతాస్త్రాన్ని పొందేవారు మహా పరాక్రమవంతులై ఉండాలి. అందువలన అర్జునిడిని శివుడు పరీక్షించాలని అనుకుంటాడు. ఒక అడవిపందిని సృష్టించి అర్జునుడు ధ్యానం చేసుకుంటోన్న ప్రదేశానికి పంపిస్తాడు. తపస్సుకి భంగం కలిగించిన పందిపై అర్జునుడు బాణం ప్రయోగిస్తాడు. అదే సమయానికి బోయవాడి వేషంలో శివుడు కూడా బాణం ప్రయోగిస్తాడు. దాని విషయంలో ఇద్దరి మధ్య గొడవ పెరుగుతుంది.
 
అర్జునుడి శౌర్య పరాక్రమాలను ప్రత్యక్షంగా చూసిన శివుడు ఆయనకి పాశుపతాస్త్రాన్ని ప్రసాదిస్తాడు. ఇంతటి విశేషమైన సంఘటన జరిగిన ప్రదేశమే 'సలేశ్వరం'గా చెప్పబడుతోంది. నల్లమల అటవీ ప్రాంతానికి చెందిన ఈ క్షేత్రంలో శివుడు సలేశ్వరుడుగా కొలవబడుతుంటాడు.
 
కొండలు ... గుహలు ... జలపాతాలతో ఆహ్లాదకరంగా కనిపించే ఈ ప్రదేశాన్ని చూడగానే, ఇది మహిమాన్వితమైన క్షేత్రమనే విషయం అర్థమైపోతుంది. సహజమైన జలధారలతో అనునిత్యం అభిషేకించబడుతూ, అర్జునుడిని అనుగ్రహించిన శివుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ స్థాయిలో తరలివస్తారు.

వెబ్దునియా పై చదవండి