టాలీవుడ్ "మండేలా"గా బండ్ల గణేశ్?

సోమవారం, 26 ఏప్రియల్ 2021 (21:41 IST)
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ హాస్య నటుడు యోగిబాబు. ఈయన ప్రధాన పాత్రధారిగా ఇటీవల వచ్చిన చిత్రం "మండేలా". మోడన్నా అశ్విన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం థియేటర్‌లో విడుదల చేయకుండా, ఓ ప్రముఖ టీవీ చానెల్‌లో డైరెక్టుగా ప్రసారం చేశారు. ఈ చిత్రంలో యోగిబాబు నాయీ బ్రాహ్మణ వృత్తి చేసే వ్యక్తిగా నటించారు. నాయీ బ్రాహ్మణులకు సంబంధించిన కథాంశంతో రూపొందిన ఈ సినిమాపై తమిళనాడు నాయీ బ్రాహ్మణుల సంఘం తమను తక్కువ చేసి చూపించారంటూ కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. 
 
ఇదిలావుంటే, ఈ సినిమాను తెలుగు రీమేక్‌ హక్కుల కోసం నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ సినిమా రైట్స్‌ దక్కితే.. ఆ సినిమాను నిర్మిస్తూ అందులో బండ్ల గణేశ్‌ టైటిల్‌ పాత్రలో నటించే అవకాశాలున్నాయి. 
 
ఇదే కనుక నిజమైతే బండ్ల గణేశ్‌ నటుడిగా మరో మెట్టు ఎక్కడానికి ప్రయత్నించినట్లే అవుతుంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది. రాజకీయాల్లో బిజీగా ఉండి.. అక్కడి నుంచి సినీ ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేశ్‌ గత ఏడాది విడుదలైన హీరో మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో చిన్న పాత్రలో నటించారు. అలాగే ఇప్పుడు నిర్మాతగా పవన్‌ కళ్యాణ్‌తో సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు