బెట్టు చేసిన కాజల్.. ఉడుంపట్టుతో ఒప్పించిన మెగాస్టార్

సోమవారం, 16 మార్చి 2020 (10:39 IST)
సాధారణంగా మెగాస్టార్ చిరంజీవితో నటించే ఛాన్స్ వస్తే మాత్రం ఏ ఒక్క హీరోయిన్ వదులుకోదు. ఎగిరిగంతేస్తుంది. అలాంటిది.. ఈ మధ్యకాలంలో చిరంజీవి సరసన నటించేందుకు పలువురు హీరోయిన్లు ముఖం చాటేస్తున్నారు. చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న "ఆచార్య" చిత్రంలో హీరోయిన్‌గా త్రిషను తొలుత ఎంపిక చేశారు. కానీ, చిత్ర బృందంతో ఏర్పడిన అభిప్రాయభేదాల కారణంగా ఈ మెగా ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. 
 
దీంతో చిత్రం యూనిట్ కొత్త హీరోయిన్ వేటలో పడింది. ఈ వేటలో భాగంగా, అందరి కళ్లు కాజల్ అగర్వాల్‌పై పడ్డాయి. ఇదే అంశంపై ఆమెను సంప్రదించగా, ఆమె బెట్టు చేసినట్టు సమాచారం. ముఖ్యంగా, రెమ్యునరేషన్ విషయంలో తనకు ఓ పెద్ద మొత్తం ముట్టజెప్పితేగానీ సమ్మతించబోనని తేల్చి చెప్పినట్టు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపించాయి. గతంలో చిరంజీవి సరసన నటిచేందుకు తహతహలాడిన ఈ పంజాబీ భామ.. ఇపుడు ఆచార్య చిత్రంలో నటించేందుకు ఏకంగా రూ.2 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
ఆమె డిమాండ్ విన్న దర్శక నిర్మాతలు నోరెళ్లబెట్టారన్నది టాలీవుడ్ హాట్ టాపిక్. చివరకు ఈ విషయం హీరో చిరంజీవి వద్దకు వెళ్లింది. ఆయన కూడా పంజాబీ ముద్దుగుమ్మకే ఓటు వేయడంతో.. 'ఆచార్య' చిత్రంలో హీరోయిన్‌గా కాజల్‌ను దర్శకనిర్మాతలు ఎంపిక చేసినట్టు తాజా సమాచారం. అయితే, దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది. మొత్తంమీద టాలీవుడ్ మెగాస్టార్‌కు హీరోయిన్లు చుక్కలు చూపిస్తున్నారని ఇట్టే తెలిసిపోతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు