నితిన్‌కు నో చెప్పిన రష్మిక.. నయన వెంటపడుతున్న కొత్త పెళ్లికొడుకు (Video)

గురువారం, 6 ఆగస్టు 2020 (10:22 IST)
టాలీవుడ్ హీరో నితిన్. ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. అయినప్పటికీ.. ఈ కుర్రోడు హీరోయిన్ల వెంటపడుతున్నారు. హీరోయిన్ రష్మికను సంప్రదించగా ఆమె నో చెప్పింది. దీంతో మరో హీరోయిన్ నయనతార వెంటపడుతున్నారట. నిజంగా నితిన్ హీరోయిన్ల వెంటపడుతున్నారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. తన తదుపరి ప్రాజెక్టులో హీరోయిన్ కోసం నితిన్ పలువురిని సంప్రదిస్తున్నారట. 
 
ఈ యేడాది ఆరంభంలో "భీష్మ"గా నితిన్ కనిపించారు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్. ఈ చిత్రంలో తర్వాత నితిన్ నటిస్తున్న చిత్రం "రంగ్ దే". ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత 'అంధాధున్' అనే చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయనున్నాడు. నితిన్ సొంత బ్యానర్‌పై ఈ సినిమా రూపొందనుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించబోతున్నాడు. 
 
ఈ సినిమాకు సంబంధించి నటీనటులను ఖరారు చేసే పనిలో ప్రస్తుతం చిత్రబృందం బిజీగా ఉందట. మాతృకలో టబు, రాధికా ఆప్టే చేసిన పాత్రలకు తెలుగులో ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. రాధిక చేసిన పాత్ర కోసం టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డేను చిత్రబృందం తాజాగా సంప్రదించినట్టు సమాచారం. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా ఈ సినిమాకు పూజ 'నో' చెప్పినట్టు తెలుస్తోంది. వరుస సినిమాలతో బిజీగా ఉండటం వలన డేట్స్ అడ్జెస్ట్ చేయలేనని చెప్పి పూజ ఈ సినిమాను తిరస్కరించిందట. దీంతో మరో హీరోయిన్ కోసం గాలిస్తున్నారు. 
 
ఈ క్రమంలో నితిన్ దృష్టి సీనియర్ నటి నయనతారపై పడిందట. నిజానికి నయనతార కంటే ముందుగా రమ్యకృష్ణ, అనసూయ వంటి వాళ్ల పేర్లు వినిపించాయి. ఇటీవల ఇలియానాను సంప్రదిస్తే ఆమె తిరస్కరించిందని వార్తలు వచ్చాయి. దీంతో నితిన్... నయనతార వెంటపడుతున్నారట.

మంచి పాత్ర కావడంతో నయన్ కూడా ఆసక్తికరంగానే ఉన్నట్టు సమాచారం. అయితే రెమ్యునరేషన్ విషయంలోనే సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు నయన్ కాస్త భారీగానే రెమ్యునరేషన్ అడిగిందట. నయన్ నటిస్తే ఈ సినిమాకు వచ్చే క్రేజ్ భారీగా ఉంటుంది. కాబట్టి, చిత్రబృందం కూడా సానుకూలంగానే ఉన్నట్టు సమాచారం. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు