''బాహుబలి''ని పైరసీ భూతం పట్టకూడదంటూ దర్శకుడు రాజమౌళి అన్నారు. చిత్రం షూటింగ్ నుంచి లీకులతో విసిగిపోయిన జక్కన్న బాహుబలి థియేటర్లో చూడాల్సిన సినిమా అంటూ పైరసీలో చూడకండని పిలుపునిచ్చారు. జులై 10న 'బాహుబలి' చిత్రం విడుదల అవుతుందని...కేవలం థియేటర్లలోనే చిత్రాన్ని చూడండని ప్రేక్షకులను కోరారు. పెద్ద సినిమా, పెద్ద తెరపై చూడాల్సిన సినిమా బాహుబలి అని మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో తెలిపారు.
మరోవైపు తెలుగువారు గర్వపడేలా 'బాహుబలి'ని నిర్మించారని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. మంగళవారం బాహుబలి చిత్రంపై సినీ ప్రముఖులు మీడియాతో మాట్లాడారు. బాహుబలి కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోందని తెలిపారు. రెండున్నరేళ్ల పాటు కష్టపడి 'బాహుబలి'ని నిర్మించారని...దయచేసి ఎవరూ పైరసీకి పాల్పడవద్దని అల్లు అరవింద్ విజ్ఞప్తి చేశారు.