అందరూ కలిస్తే మయసభ లాంటి భవనం.. 'మా' ఎన్నికలపై బాలయ్య

గురువారం, 15 జులై 2021 (17:08 IST)
సినిమా అనేది ఓ గ్లామర్ ఫీల్డని సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. పైగా, సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ కలిస్తే మయసభలాంటి ఇంద్రభవనాన్ని నిర్మించుకోవన్నారు. 
 
టాలీవుడ్‌కు చెందిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ వేడెక్కింది. అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్న నటుడు ప్రకాశ్ రాజ్‌ని ఉద్దేశిస్తూ కొందరు నాన్ లోకల్ అనే ప్రస్తావనను కూడా తీసుకొచ్చారు. ఇది పెద్ద చర్చకే దారి తీసింది. 
 
ఈ నేపథ్యంలో మా ఎన్నికలపై బాలకృష్ణ స్పందించారు లోకల్, నాన్ లోకల్ అనేవాటిని అస్సలు పట్టించుకోనని చెప్పారు. గతంలో 'మా' అసోసియేషన్ లో ఉన్నవాళ్లు ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు అంటూ ఫస్ట్ క్లాస్ టికెట్లతో విమానాల్లో తిరిగారని... ఆ డబ్బులను ఏం చేశారని బాలయ్య ప్రశ్నించారు. 
 
'మా' అసోసియేషన్ కు ఇంత వరకు శాశ్వత భవనాన్ని ఎందుకు నిర్మించలేకపోయారని అడిగారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక్క ఎకరం భూమిని కూడా సంపాదించలేకపోయారా? అని ప్రశ్నించారు. అయితే 'మా' శాశ్వత భవన నిర్మాణానికి మంచు విష్ణు ముందుకొచ్చారనే విషయాన్ని ప్రస్తావించగా... ఆ కార్యక్రమంలో తాను కూడా భాగస్వామిని అవుతానని బాలయ్య చెప్పారు. 
 
చిత్రసీమకు చెందిన ప్రతి ఒక్కరూ కలిస్తే అసోసియేషన్ కోసం మయసభలాంటి అద్భుతమైన భవనాన్ని కట్టుకోవచ్చని అన్నారు. సినీ పరిశ్రమ అనేది గ్లామర్ ఫీల్డ్ అని... ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలను బహిరంగ వేదికలపై చర్చించకూడదని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు