బస్తీ కుర్రాడిగా జయసుధ తనయుడు శ్రీయాన్ కపూర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'బస్తీ'. ఈ చిత్రాన్ని జూలై 3న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. వాజమన్ ప్రొడక్షన్స్ పతాకంపై వాసు మంతెన దర్శకుడిగా పరిచయమవుతూ నిర్మిస్తున్నారు. ప్రగతి చౌరాస్య హీరోయిన్గా పరిచయమవుతోంది. దర్శకనిర్మాత వాసు మంతెన మాట్లాడుతూ...''ఒక బస్తీలో రెండు వర్గాల మధ్య జరిగే ఓ గొడవతో నాయకానాయికలు కలుస్తారు.
''సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు ఈ సన్నివేశాన్ని ఇదివరకు చూసుండరని ఖచ్చితంగా చెప్పగలను. షూటింగ్ కేవలం 36 రోజుల్లో పూర్తిచేశాం పాటలతో కలిపి. హీరోహీరోయిన్తో సహా నాకూ ఇది మొదటి సినిమానే. అయితే ఏదైనా చేసేముందు దాని గురించి పరిశోధించడం నా అలవాటు. అలానే సినిమా చేశాను. ఎక్కడ కొత్తగా అనిపించలేదు. నా బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఈ సినిమాకి చాలా సాయపడింది. ఎడిటింగ్ కూడా సులువు అవుతుందని రెండు కెమెరాలతో చిత్రీకరణ జరిపాం. ప్రతి పాత్రకు ప్రాముఖ్యత వుంటుంది. కెమెరామెన్ గుణశేఖర్, ఎడిటర్ గౌతంరాజు, జయసుధ ఈ సినిమాకి మంచి సపోర్ట్ ఇచ్చారన్నారు''.