దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ‘మగధీర’ తర్వాత గ్రాఫిక్స్కు నిర్మాతలు కొంత బడ్జెట్ కేటాయించడం మొదలైంది. ‘బాహుబలి’తో విజువల్ ఎఫెక్ట్స్ నేపథ్యంలో సినిమాలు తీసేందుకు మరింత ముందడుగు వేస్తున్నారని బాబుబలి2 విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ కమల్ కణ్ణన్ చెప్పారు. ఏ సినిమాలో అయినా సరే సన్నివేశాల్లోని భావోద్వేగాలను తెరపై ఆవిష్కరించడంలో విజువల్ ఎఫెక్ట్స్ సహాయపడతాయి. అంతే తప్ప గ్రాఫిక్స్ ఎప్పుడూ సినిమాలో భావోద్వేగాలను డామినేట్ చేయలేవు అంటున్న కణ్ణన్ బాహుబలి 2 కి మన దేశంలోనూ, విదేశాల్లోనూ సుమారు 50 స్టూడియోలు ‘బాహుబలి–2’కి గ్రాఫిక్స్ పని చేశాయని తెలిపారు. బాహుబలి2తో తన పయనం గురించి ఆయన మాటల్లోనే విందాం.
అక్టోబర్ 16, 2015న నేను ‘బాహుబలి–2’ టీమ్లో చేరాను. అప్పటికే వర్క్ ప్రారంభమైంది. 2,555 షాట్స్లో గ్రాఫిక్స్ అవసరమని గుర్తించాను. లాస్ ఏంజెల్స్లోని జాన్ గ్రిఫిక్స్ అనే వ్యక్తి వార్ సీన్స్ కంప్లీట్ చేసేశాడు. ఈ 18 నెలల్లో 2200 షాట్స్లో గ్రాఫిక్స్ పూర్తి చేయడమంటే జోక్ కాదు. మన దేశంలోనూ, విదేశాల్లోనూ సుమారు 50 స్టూడియోలు ‘బాహుబలి–2’కి పని చేశాయి.
‘బాహుబలి’తో పోలిస్తే రెండో భాగంలో విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువ. ఇందులో మాహిష్మతి రాజ్యాన్ని పూర్తిగా చూడొచ్చు. దేవసేనకు చెందిన కుంతల రాజ్యం కూడా ఈ పార్టులోనే ఉంటుంది. మాహిష్మతి, కుంతల రాజ్యాల మధ్య తేడాను చూపించడం దర్శకుడితో పాటు మాకు సవాల్గా నిలిచింది. సినిమాలో గ్రాఫిక్స్ ఎంత గొప్పగా ఉంటాయో... ఎమోషనల్, డ్రామా కూడా అంతే గొప్పగా ఉంటాయి.
ఏప్రిల్ 28న చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించడంతో... గ్రాఫిక్స్ వర్క్ త్వరగా పూర్తి కావాలని నవంబర్ నుంచి తొందర పెట్టారు. ఫిబ్రవరిలో మా వర్క్ పూర్తి చేసి, తర్వాత కరెక్షన్స్ చూడడం ప్రారంభించాం. ఇంకా ఐదు కరెక్షన్స్ చేయాలి. ఏదైనా సీన్లో రాజమౌళి చెప్పినట్టు గ్రాఫిక్స్ చేయడం కుదరదంటే ఒప్పుకోరు. గూగుల్లో వెతుకుతారు. నేరుగా విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్టుతో మాట్లాడతారు. వర్క్ పరంగా రాజమౌళిని శాటిస్ఫై చేయడం చాలా కష్టం. ప్రతి అంశంపై ఆయనకు పట్టుంది.