మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా 150వ సినిమా శరవేగంగా తెరకెక్కుతోంది. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా చందమామ కాజల్ ఫైనల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయింది.
ఎప్పటినుంచో చిరంజీవి 150వ సినిమాకు రకరకాల టైటిల్స్ ఊహాగానాలయ్యాయి. అయితే ఈ సినిమాకి నూటికి నూరు శాతం సరిపడే “ఖైదీ నెంబర్ 150’’ అనే పేరును ఖరారు చేసినట్లు చిత్ర నిర్మాత రామ్ చరణ్ తెలిపారు. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న (సోమవారం) 150వ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ను రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేయనున్నారు.
* మెగా ఫ్యాన్స్లో ఒకటే హుషారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. చిరు స్టెప్పేస్తే, చిరు చిందేస్తే ఎలా ఉంటుందో ముందు ముందు చూడబోతున్నాం. అన్నయ్యలో మునుపటి ఎనర్జీ రీలోడ్ అయ్యిందన్న చిత్రయూనిట్ టాక్తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే ఉత్సాహంలో ఆగస్టు 22న (నేడు) మెగాస్టార్ బర్త్డేని పురస్కరించుకుని ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టాప్ టెంపుల్స్లో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో నవతరం హీరోలు సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్ కుటుంబ సమేతంగా పాల్గొనడం విశేషం. మెగాఫ్యాన్స్ ఈ ఉత్సవాల్ని హుషారుగా దగ్గరుండి దిగ్విజయంగా నడిపించారు.
* ప్రతిష్ఠాత్మక 150వ సినిమాని స్టార్ డైరెక్టర్ వినాయక్ సరికొత్త పంథాలో తెరకెక్కిస్తున్నారన్నది చిత్రయూనిట్ మాట. చిరును మరో లెవల్లో ఆవిష్కరించేందుకు వినాయక్ అన్నివిధాలా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారు. అందుకు తగ్గట్టే మునుపటి జోష్ ఏమాత్రం తగ్గకుండా మెగాస్టార్ హుషారుగా షూటింగులో పాల్గొంటున్నారు. తెలుగు ప్రేక్షకులకు నచ్చే అన్ని కమర్షియల్ అంశాలతో, మన నేటివిటీకి తగ్గ కథాంశమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని చిత్రయూనిట్ చెబుతోంది.