దేశవ్యాప్తంగా అమీర్ ఖాన్ ''దంగల్'' సినిమాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ టాప్ స్టార్ అమీర్ ఖాన్ నటనకు తోడు.. స్ఫూర్తినిచ్చే సినిమాగా నిలిచిన దంగల్ సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో దంగల్ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి పెద్దకుమార్తె సుస్మితా కొణిదెల ట్వీట్ చేశారు.
అమీర్ ఖాన్తో పాటు దంగల్ అండ్ టీమ్ నిర్మించింది కేవలం సినిమాను మాత్రమే కాదని, స్ఫూర్తినిచ్చారని ట్వీట్ చేశారు. ఇప్పటికే రెండుసార్లు ఈ సినిమాను చూశామన్నారు. ఇంకా చెప్పాలంటే.. తమ ఇంట్లో దంగల్ ఫీవర్ పట్టుకుందని.. మా ఇంట్లో లిటిల్ రెజర్లు అంటూ తన ఇద్దరు కుమార్తెలు కుస్తీ పడుతున్న ఫోటోను సుస్మిత పోస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే... సుస్మిత ఖైదీ సినిమా పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. సినిమా మొదలైనప్పటి నుంచి ఆ సినిమాకు సంబంధించిన పనులన్నీ నిర్మాత చెర్రీతో కలిసి చేస్తున్న సుస్మిత.. ప్రస్తుతం ప్రీ రిలీజ్ ఫంక్షన్ పనుల్లో ఉన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150' ప్రీరిలీజ్ ఫంక్షన్ గుంటూరులోని హాయ్ ల్యాండ్లో జరగనుంది. ఈ ఫంక్షన్ కు మెగా హీరోలంతా తరలిరానున్నారు.
కానీ పవర్ స్టార్ జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరవుతారా? లేదా? అనేది మెగా అభిమానుల్లో పెను సందేహంగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో, ఈ విషయంపై ప్రముఖ నిర్మాత, చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. 'ఖైదీ' వేడుకకు పవన్ కల్యాణ్ హాజరు కావడం లేదని ఆయన స్పష్టం చేశారు. బిజీ షెడ్యూల్ కారణంగానే పవన్ రావడం లేదని స్పష్టం చేశారు.