డబ్బులు తీసుకుంది.. ప్రమోషన్‌లకు ఎగ్గొడుతుంది.. ఆమె సంగతి కాస్త చూడండి.. నిర్మాత ఫిర్యాదు

శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (15:50 IST)
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మపై ఒక నిర్మాత ఫిర్యాదు కూడా చేశారు. వేరే సినిమాకు ఫుల్‌ప్రమోషన్ చేసిన ఆమె తన సినిమాకు మాత్రం ఎలాంటి ప్రమోషన్ చేయలేదని.. ఈ విషయంపై విచారణ జరపాలని ఆ నిర్మాత ఆర్కే సురేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన బ్యానర్‌లో నటించిన చిత్రానికి ఎందుకు ప్రమోషన్ చేయలేదో తెలపాలని ఆయన ఫిర్యాదు చేశారు. 
 
కాగా ఈ విషయం ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తమన్నాపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్టిస్టుల అసోసియేషన్ నడిగర్ సంఘానికి నిర్మాత ఫిర్యాదు చేశారు. విజయ్ సేతుపతి హీరోగా తమన్నా హీరోయిన్‌గా "ధర్మదురై" అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా విడుదలకు ముందుగానీ తర్వాత కానీ హీరోయిన్ తమన్నా ఎలాంటి ప్రమోషన్లలోనూ పాల్గొనలేదట. 
 
కానీ ఆమె తాజా చిత్రం "అభినేత్రి" ప్రమోషన్‌లో జోరుగా హంగామా చేస్తుందట. దీంతో సదరు ప్రొడ్యూసర్‌కి ఫుల్ కోపం పుట్టుకొచ్చి నడిగర్ సంఘంలో ఫిర్యాదు చేశాడు. అయితే ఈ విషయంలో విచారణ జరపాల్సిన ఆర్టిస్టుల అసోసియేషన్ నడిగర్ సంఘం సెక్రటరీ విశాల్‌తో తమన్నా తాజాగా "కత్తి సండై" సినిమాలో నటిస్తోంది. దీంతో ఆ ఫిర్యాదుపై విచారణ ఎలా జరుగుతుందోనని అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి