మల్టీస్టారర్ సినిమా తీస్తే పవన్ - రవితేజలతో తీస్తా : హరీష్ శంకర్

వరుణ్

మంగళవారం, 6 ఆగస్టు 2024 (19:55 IST)
తనకు మల్టీస్టారర్ చిత్రం తీసే అవకాశం వస్తే మాత్రం మరో ఆలోచన లేకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హీరో రవితేజలతో కలిసి తీస్తానని దర్శకుడు హరీష్ శంకర్ తెలిపారు. రవితేజ హీరోగా ఆయన తెరకెక్కించిన చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ నెల 15వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆయన పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇందులో మల్టీస్టారర్‌ తీయాల్సి వస్తే ఎవరితో తీస్తారు? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి హరీష్ శంకర్ సమాధానమిస్తూ, పవన్‌కల్యాణ్‌, రవితేజతో చేస్తానని అన్నారు. 
 
ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు తెరపై కనిపించినా మాస్‌ ప్రేక్షకులు విజిల్స్‌ హోరెత్తిస్తారు. అలాంటిది ఇద్దరు హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే, పూనకాలతో ఊగిపోవడం ఖాయం. ఈ విషయం సామాజిక మాధ్యమాల వేదికగానూ ట్రెండ్‌ అవుతుండటంతో ఓ ట్వీట్‌కు కూడా హరీశ్‌ రిప్లై ఇచ్చారు. ‘చాలా మంది చాలాసార్లు అడిగారు. అది కార్యరూపం దాల్చాలని ఆశిద్దాం’ అన్నారు. 
 
అలాగే, మహేశ్‌బాబుతోనూ ఒక సినిమా చేయాలని ఉందని అన్నారు. అది తన చిరకాల కోరిక అని అభిప్రాయపడ్డారు. అలాగే, కొన్ని సందర్భాల్లో దర్శకుడిగా తాను ఫెయిల్‌ అయి ఉండవచ్చు. కానీ, తన సినిమాల విషయంలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ ఎప్పుడూ ఫెయిల్‌ కాలేదని హరీశ్ శంకర్‌ చెప్పుకొచ్చారు.
 
ఇక ‘మిస్టర్ బచ్చన్‌’ విషయానికొస్తే, హిందీలో విజయవంతమైన ‘రైడ్‌’కు రీమేక్‌గా దీన్ని తీసుకొస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. రవితేజ నటన, హరీశ్‌ శంకర్‌ టేకింగ్‌తో పాటు, భాగ్యశ్రీ బోర్సే అందాలు సినిమాపై అంచాలను పెంచాయి. తొలి సినిమాతోనే సామాజిక మాధ్యమాల వేదికగా యువ హృదయాలను భాగ్యశ్రీ కొల్లగొడుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు