నేచురల్ స్టార్ నానికి మెగాస్టార్ చిరంజీవి బాకీ పడ్డారు. అదీ కూడా చిరంజీవి మాస్టర్ చిత్రం విడుదలైనప్పటి నుంచి ఈ బాకీని తీర్చలేదట. ఆ బాకీ ఇప్పటికైనా తీర్చాలని నాని గట్టిగా డిమాండ్ చేశాడు. దీంతో నాని పోడు భరించలేక.. ఆ బాకీ తీర్చేందుకు చిరంజీవి సమ్మతించాడు. ఇంతకీ నానికి చిరంజీవి బాకీ ఎందుకు పడ్డాడో తెలుసుకుందాం.
స్టార్ మాటీవీలో చిరంజీవి యాంకర్గా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమం ప్రసారమవుతున్న విషయం తెల్సిందే. ఈ కార్యక్రమానికి హీరో నాని హాజరయ్యాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... చిరంజీవి స్ఫూర్తితోనే కష్టపడి పైకొచ్చానని చెప్పాడు. అలాగే చిరంజీవి తనకొక సైకిల్ బాకీ ఉన్నారని, అది తనకు ఇప్పుడు ఇవ్వాలని అడిగాడు.
'నేను చదువుకునే రోజుల్లో మా ఇంట్లో వాళ్లు నాకు ఓ సైకిల్ కొనిచ్చారు. ఆ సైకిల్ వేసుకుని అమీర్పేట్ సత్యం థియేటర్లో అప్పుడే విడుదలైన ‘మాస్టర్’ సినిమాకు వెళ్లాను. థియేటర్ ఖాళీగా లేకపోవడంతో టిక్కెట్ల కౌంటర్లోకి ఎలాగోలా దూరిపోయి ఓ టిక్కెట్ సంపాదించాను. తీరా బయటకు వచ్చి చూస్తే నా సైకిల్ లేదు. అయినా సైకిల్ గురించి బాధపడకుండా టిక్కెట్ దొరికిందన్న ఆనందంలో సినిమాకు వెళ్లిపోయా. సినిమా అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది సైకిల్ పోయిందని. అప్పుడు ఏడుపు మొదలైంది. ఆ సమయానికి ఇంట్లో వాళ్ళకు సర్దిచెప్పాను.
ఇటీవల తాను నటించిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా చేసినపుడు నిర్మాత అరవింద్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లా. ఆయన ఖచ్చితంగా నాకు సైకిల్ ఇస్తానని చెప్పారు. కానీ, ఇప్పటివరకు ఇవ్వలేదు. కాబట్టి, చిరంజీవిగారు మీరు నాకు సైకిల్ ఇవ్వండి’ అని నాని అడిగాడు. దానికి స్పందించిన చిరంజీవి.. తప్పకుండా సైకిల్ కొనిస్తానని, అది తనకు ఎంతో ఆనందమని జవాబిచ్చాడు.