'ఖైదీ' ముఖ్యఅతిథుల లిస్టు నుంచి పవన్ ఔట్... దర్శకదిగ్గజాల పేర్లు ఖరారు!

బుధవారం, 4 జనవరి 2017 (11:06 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150". ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందు ఈ చిత్రం ప్రీరిలీజ్ ఫంక్షన్‌ను ఈనెల 7వ తేదీన నిర్వహించనున్నారు. గుంటూరులోని హాయ్‌ల్యాండ్ వేదికగా ఈ ఫంక్షన్ జరుగనుంది. 
 
అయితే, ఈ ఫంక్షన్‌కు మెగా సోదరుడు, జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ వస్తారనే ఊహాగానాలు వచ్చాయి. అయితే, ఇపుడు అవి కేవలం పుకార్లేనని తేలిపోయాయి. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా ప్రముఖ దర్శకులు దాసరి నారాయణ రావు, కె.రాఘవేంద్ర రావు హాజరవుతారని హీరో, ఈ చిత్ర నిర్మాత కూడా అయిన రాం చరణ్ వెల్లడించాడు. 
 
ప్రస్తుతం ఫారిన్ టూర్‌లో ఉన్న చెర్రీ.. అక్కడి నుంచే ఫేస్‌బుక్, ద్వారా ఈ ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌కు సంబంధించిన వివరాలు తెలియజేశాడు. చాలామంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా ఈ ఈవెంట్‌కు వస్తారని, తన బాబాయ్ పవన్ కళ్యాణ్‌కు కూడా ఆహ్వాన పత్రిక ఇస్తామని చరణ్ చెప్పాడు. హాలిడే ట్రిప్ కోసం చరణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు తమ కుటుంబాలతో స్విట్జర్లాండ్ తదితర దేశాల్లో టూర్‌లో ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి