భార్యకు చిత్ర హింసలు - ప్రముఖ నటుడి తనయుడు అరెస్టు

బుధవారం, 26 మే 2021 (10:56 IST)
కట్టుకున్న భార్యను చిత్రహింసలకు గురిచేసిన కేసులో ప్రముఖ సౌత్ ఇండియన్ నటుడు రాజన్ పి దేవ్ కుమారుడు ఉన్ని రాజన్‌ను పోలీసులు అరెస్టుచేశారు. కేరళ రాష్ట్రంలోని నెడుమంగడ్​ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నిజానికి అతన్ని చాలారోజుల క్రితమే అరెస్టు చేయాల్సి ఉంది. అయితే కరోనా పాజిటివ్​ రావడంతో నెగెటివ్ రిపోర్ట్​​ వచ్చేదాకా పోలీసులు ఎదురు చూశారు.
 
కాగా, ఉన్నిరాజన్​ కూడా నటుడే. కమెడియన్​గా, విలన్​గా దాదాపు 30 వరకు మలయాళ చిత్రాల్లో నటించాడు. 2019లో ఉన్నికి ప్రియాంకకు వివాహం జరిగింది. ఆమె ఓ స్కూల్​లో టీచర్​గా పని చేస్తోంది. పెళ్లయిన కొన్నాళ్లకే అదనపు కట్నంతో పాటు గొంతెమ్మ కోర్కెలు కోరుతూ ప్రియాంకను భర్త ఉన్ని ప్రతీరోజూ హింసించేవాడని ప్రియాంక తల్లి ఆరోపిస్తోంది.
 
అంతేకాదు ఓరోజు గొడవలో అడ్డువెళ్ళినందుకు తనపై కూడా దాడి చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, ఆత్మహత్యకు ముందు ప్రియాంక కూడా పోలీసులకు కంప్లయింట్ చేసినట్లు తెలుస్తోంది. మే 11న ఉన్ని ఇంట్లో గొడవ జరిగిందని, వెంటనే పుట్టింటికి ప్రియాంక ఇంటికి వచ్చేసింది. ఆ మరుసటిరోజే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
 
కాగా, మలయాళ నటుడైన రాజన్​ పి దేవ్​.. ఆది, దిల్​, ఒక్కడు, ఖుషి, గుడుంబా శంకర్​ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. దాదాపు 200 సినిమాలకు పైనే నటించిన రాజన్​ పి దేవ్​.. 2009లో లివర్​ సంబంధిత అనారోగ్యంతో చనిపోయారు. తండ్రి చనిపోయాక జల్సాలకు అలవాటు పడిన ఉన్ని, కుటుంబ సభ్యులతో కలిసి డబ్బు కోసమే ప్రియాంకను వేధించినట్లు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు