మలయాళీ బొమ్మాళీలకు టాలీవుడ్ 'ఫిదా'... ఎందుకలా?

సోమవారం, 31 జులై 2017 (20:47 IST)
టాలీవుడ్‌లో ఎంతోమంది హీరోలు వస్తున్నారుగానీ హీరోయిన్‌లు మాత్రం పక్క రాష్ట్రాల నుండి దిగుమతి అవుతున్నారు. అలా అవుతున్న వారిలో మలయాళీ ముద్దుగుమ్మలు ముందువరసలో ఉంటారు. ఒకప్పుడు తెలుగు హీరోయిన్‌లు ఇతర భాషల్లో నటించిన సందర్భాలు కోకొల్లలు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తి రివర్స్‌లో నడుస్తోంది. నయనతారా నుండి ఇప్పటి సాయిపల్లవి దాకా అలా వచ్చి టాలీవుడ్‌లో స్థిరపడిన వారు చాలామందే ఉన్నారు. 
 
అలా వచ్చిన వారిలో నటి అసిన్, ప్రియమణి, సింధూ మీనన్, భావన, గోపిక, మమతా మోహన్ దాస్, శరణ్యా మోహన్, కళ్యాణి, మంజిమా మోహన్, కీర్తి సురేశ్, అను ఇమ్మానుయేల్ తదితర హీరోయిన్లు ఎంతోమంది టాలీవుడ్‌లో గత కొన్ని సంవత్సరాల పాటు తమదైన నటనతో ప్రేక్షకులను మురిపిస్తున్నారు. అందులో ఇప్పుడు కీర్తి సురేశ్, అను ఇమ్మానుయేల్‌లు తీసిన సినిమాలు రెండే అయినా, మూడో సినిమా "పవన్ కళ్యాణ్" సరసన నటించే ఛాన్స్ కొట్టేశారు. 
 
ఇక తాజాగా "ఫిదా" సినిమాతో తన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన "మలయాళ ప్రేమమ్" హీరోయిన్ సాయి పల్లవి కూడా ఆ కోవకే చెందింది. ఇది హిట్టయ్యేసరికి అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇలా వారు టాలీవుడ్‌‌ని ఏలడానికి కారణాలు లేకపోలేదు, ఎందుకంటే వారు భావాలను పలికించడంలో నేర్పరులు, నటనలో తమ ప్రావీణ్యాన్ని చూపించడంలో వారు ఆరితేరి ఉంటారు. 
 
కాబట్టే వారు ఎంత రెమ్యూనరేషన్ అడిగినా ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అయిపోతున్నారు. అందులోనూ టాలీవుడ్‌లో వారసుల బెడద ఉండనే ఉంది. ఒకే ఇంట్లో చాలామంది హీరోలు ఉండటం కూడా వారికి కలిసొచ్చే అంశమే. అలా వారి జీవితాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతూ "టాలీవుడ్‌ యాక్టింగ్ క్వీన్స్" అనిపించుకుంటున్నారు.

వెబ్దునియా పై చదవండి