టాలీవుడ్ ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ల కుమారుడు అకీరా నందన్ సైకిల్ తొక్కుతూ జారి కిందపడ్డాడు. దీంతో అకీరాకు స్వల్ప గాయాలయ్యాయి. ఆ వెంటనే రేణూ దేశాయ్ తన కుమారుడిని తీసుకుని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి పరుగులు పెట్టింది. అయితే, కార్పొరేట్ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శించడంతో రేణూకు ఆగ్రహం కట్టులు తెంచుకుంది.
ఆ వెంటనే ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. 'అకీరా సైకిల్ ప్రమాదంలో గాయపడ్డాడు. వెంటనే అతడిని పేరున్న ఓ ఆసుపత్రికి తీసుకెళ్లాను. గాయపడిన చిన్న పిల్లాడికి వైద్యం చేయకుండా వైద్యులు ఆలస్యం చేశారు. బాధతలో ఎదురుచూడాల్సి వచ్చింది. చికిత్స కోసం పెద్ద ఆసుపత్రులకు వెళ్లడం కంటే నేరుగా చనిపోవడమే మేలు. డాక్టర్ల నుంచి నర్సుల వరకు మొత్తం వ్యవస్థ నిర్లక్ష్యం మానవత్వాన్ని చంపేస్తోంది' అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.