ఖాజీపల్లి ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్న హీరో ప్రభాస్!

సోమవారం, 7 సెప్టెంబరు 2020 (20:20 IST)
'బాహుబలి' చిత్రంతో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన టాలీవుడ్ హీరో ప్రభాస్. ఈయన కేవలం సినిమాల్లో హీరోనే కాదు.. నిజ జీవితంలో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. అలాగే, తన ఎదుగుదలలో చేయూతనందించిన సహచరులకు ప్రత్యేక బహుమతులు ఇస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్‌లో సామాజిక బాధ్యత కూడా మెండుగా ఉంది. ఆ కారణంగానే హైదరాబాద్‌ బాహ్య వలయ రహదారి (ఔటర్ రింగ్ రోడ్డు)కు సమీపంలోని ఖాజీపల్లి ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్నారు. ఈ అటవీ ప్రాంతం ఖాజీపల్లికి సమీపంలో ఉంది. అందుకే దీనికి ఖాజీపల్లి అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ అని పిలుస్తుంటారు. 
 
తెరాస ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా, మొక్కలు నాటిన ప్రభాస్ ఓ 1000 ఎకరాల అటవీభూమిని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త సంతోష్ కుమార్ ఎక్కడ చూపిస్తే అక్కడ రిజర్వ్ ఫారెస్ట్‌ను అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. ఈ మేరకు ఖాజీపల్లి అర్బన్ బ్లాక్‌ను దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ కూడా హాజరయ్యారు.
 
మరోవైపు, ప్రభాస్ 1650 ఎకరాల అటవీభూమిని దత్తత తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ భూమి జిన్నారం మండలం ఓఆర్ఆర్ సమీపంలో ఉంది. ఈ ఫారెస్ట్ రిజర్వ్ భూమిని ప్రభాస్ తన తండ్రి దివంగత యూవీఎస్ రాజు (యు.వి.సత్యనారాయణ రాజు) పేరుమీద అర్బన్ పార్క్, అటవీప్రాంతంగా అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే రూ.2 కోట్లు అందించిన ప్రభాస్, అవసరమైతే మరింత ఖర్చు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. 

ఇంకోవైపు, ప్రభాస్ సినిమాల్లో కూడా ఫుల్‌బీజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఆయన వరుస చిత్రాలు చేసేందుకు సంతకాలు చేశారు. ఈ చిత్రాలన్నీ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీలుగా తెరకెక్కనున్నాయి. ఈ కోవలో ఇప్పటికే మూడు చిత్రాలు ఉన్నాయి. వాటిలో ఒకటి సీనియర్ హీరో కృష్ణంరాజు నిర్మించే చిత్రం కాగా, మరొకటి ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ నిర్మించే చిత్రం, మరొకటి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ నిర్మించే చిత్రాలు ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు