ఉదయం 8 గంటలకు హైదరాబాదు నుంచి తిరుపతి బయలుదేరాల్సిన ట్రూజెట్ విమానం సాయంత్రం 6 గంటలకు గాని బయలుదేరలేదు. ట్రూజెట్లో ప్రయాణం కోసం టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులు శుక్రవారం ఉదయమే శంషాబాదు ఎయిర్ పోర్టు చేరుకున్నారు. కానీ విమానం రాకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగేలోగానే రంగప్రవేశం చేసిన టర్బో మేఘా ఎయిర్ వేస్ అధికారులు అనివార్య కారణాల వల్ల విమానాన్ని 6 గంటలకు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొత్త విమానయాన సంస్థ కదా, సరేలే అనుకుంటూ ప్రయాణికులు సర్దుకుపోయారు.
అయినా సాయంత్రం 6.30 గంటలకు వచ్చిన విమానం ప్రయాణికులను తీసుకుని తిరుపతికి బయలుదేరి, మరి కాసేపటికే తిరిగి శంషాబాదుకు చేరుకుంది. దీంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రన్ వేపైనే ఆందోళనకు దిగారు. తిరుపతిలో వాతావరణం అనుకూలించని కారణంగానే తిరిగి శంషాబాదు రావాల్సి వచ్చిందని చెప్పిన అధికారులు టికెట్ డబ్బుల్ని తిరిగిచ్చేశారు. దీంతో వేరే విమానాల్లో ప్రయాణీకులు గమ్య స్థానాలకు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.