కులమత వర్గాలకు అతీతంగా అందరూ భగవంతుని పూజించి, భగవంతుని దివ్యానుగ్రహం పొందవచ్చు.. అని లోకమునకు చాటిన జగద్గురువులు భగవద్రామానుజులు. భగవద్రామానుజుల వారు ఆదిశేషాంశ సంభూతులు. భూలోకంలో ఉండే జనులందరికీ మోక్షం ప్రసాదించడం కోసం శ్రీమన్నారాయణుని దివ్యాజ్ఞతో స్వయంగా ఆదిశేషులే భగవద్రామానుజులుగా తుండరీ మండలంలో శ్రీ పెరుంబదూరు గ్రామంలో అవతరించి కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు ఎన్నో సంస్కరణలు గావించిన మహానుభావులు భగవద్రామానుజులు. ఈయన సహస్రాబ్ధి ఉత్సవాల సందర్భంగా అపర రామానుజులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరు స్వామి వారు శంషాబాద్లో 200 అడుగుల రామానుజ విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నారు.
అదేవిధంగా స్వామివారు రామానుజుల వారి వైభవాన్ని ప్రజలందరూ తెలుసుకొనే విధంగా 'సంఘసంస్కర్త భగవద్రామానుజులు' అనే చలన చిత్రాన్ని అమృత క్రియేషన్స్ బ్యానర్పై నిర్మించారు. ఈ చలనచిత్ర ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్లో ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5గంటల నుండి 9గంటల వరకు హైటెక్ సిటి, మాదాపుర్ శిల్పకళావేదికలో జరుగుతుంది.
ఈ వేడుకకు చిన్నజీయరు స్వామివారు, కల్వకుంట్ల చంద్రశేఖర రావు విచ్చేసి వారి శ్రీ హస్తముల ద్వారా సీడీలను ఆవిష్కరణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రధాన కార్యదర్శి శ్రీమాన్ డి. కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ... ఎనిమిది మంది పీఠాధిపతులు ఒకే వేదికపై ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు. ఆడియోను విడుదల అనంతరం శ్రావణ మాసంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.
దర్శకురాలు మంజుల సూరోజు మాట్లాడుతూ, ''హరిజనులకు ఆలయ ప్రవేశం కల్పించిన సంఘసంస్కర్త భగవద్రామానుజులు జీవితాన్ని చిత్రంగా తెరకెక్కించనున్నాం. వారు చేసిన కార్యక్రమాలే ఈ చిత్రానికి ప్రధాన అంశాలు. తోట వెంకటరమణ గారు అధ్బుతమైన ఫోటోగ్రఫీ అందించారు. పి.జె. నాయుడుగారి మ్యూజిక్ చిత్రానికి ప్లస్ అవుతుంది'' అని చెప్పారు.