కోచ్చడయాన్ నష్టాలు: లతా రజనీకాంత్‌కు సుప్రీం కోర్టు నోటీసులు..

గురువారం, 1 డిశెంబరు 2016 (10:00 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్‌కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. కోచ్చడయాన్ సినిమా బకాయిల చెల్లింపు కేసులో చెన్నైకి చెందిన యాడ్‌బ్యూరో సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు లతా రజనీకాంత్‌కు నోటీసులను సిబ్బంది నేరుగా వెళ్లి అందించాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి లతా రజనీకాంత్‌కు పలుసార్లు నోటీసులు జారీ చేసినా.. అవన్నీ తిరిగి వచ్చేయడంతో సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 
 
కోచ్చడయాన్ చిత్రం వల్ల నష్టాలు ఎదురైతే తగిన పరిహారం చెల్లిస్తానని లతా రజనీకాంత్ తమకు హామీ ఇచ్చారని, ఆ చిత్రం ఆశించినమేరకు విజయం సాధించకపోవడంతో తమకు భారీగా నష్టాలు వచ్చాయని, కనుక మాట ప్రకారం పరిహారం చెల్లించాలని యాడ్‌బ్యూరో సంస్థ గతంలో హైకోర్టులో కేసు వేసింది. ఆ కేసుపై లతా రజనీకాంత్ స్టే తెచ్చుకున్నారు. నాలుగు వారాల్లో లతా రజనీకాంత్ కౌంటర్‌ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ఆ నోటీసులో ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను జనవరి 13వ తేదీకి వాయిదా వేశారు.

వెబ్దునియా పై చదవండి