మహేష్ బాబు ముఖ్య అతిథిగా కృష్ణ నటించిన 'శ్రీశ్రీ' చిత్రం ఆడియో ఫిబ్రవరి 18న....
మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (18:42 IST)
సూపర్స్టార్ కృష్ణ కథానాయకుడిగా, శ్రీమతి విజయనిర్మల కథానాయికగా కలిసి నటిస్తున్న ఎస్.బి.ఎస్. ప్రొడక్షన్స్ సంస్థ..దర్శకుడు ముప్పలనేని శివ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ''శ్రీశ్రీ''. దీనికి సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసుకుని ఈనెల (ఫిబ్రవరి) 18న అంగరంగ వైభవంగా హైద్రాబాద్ శిల్పకళావేదికలో ఆడియో వేడుక జరగనుంది. ''శ్రీశ్రీ'' ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా సూపర్స్టార్ కృష్ణగారి తనయుడు మహేష్బాబు వస్తుండటం విశేషం. అలాగే ఒక ప్రత్యేకతతో కూడిన వేడుకగా ''శ్రీశ్రీ'' నిలిచిపోనుంది.
ఈ ఆడియో పండుగతో పాటు.. సూపర్స్టార్ కృష్ణ 50 యేళ్ళ సినిమా కెరియర్ను పూర్తిచేసుకున్న సందర్భంగా ఇదొక గోల్డెన్ హిస్టరీగా భావిస్తూ.. సూపర్స్టార్ సినీ స్వర్ణోత్సవ కార్యక్రమం జరుగనుంది. దీన్ని ఎన్నో హిట్లు, సూపర్హిట్లు ఇచ్చిన సీనియర్ దర్శకుడు ముప్పలనేని శివ, నిర్మాతలు సాయిదీప్ చాట్ల, వై. బాలు రెడ్డి, షేక్ సిరాజ్లు ఎక్కడా రాజీపడకుండా అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
చక్కని ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలను రూపొందించి సక్సెస్ అయిన దర్శకుడు ముప్పలనేని శివ మాట్లాడుతూ-సూపర్స్టార్ మహేష్బాబు మాములుగా ఆడియో వేడుకలకు అతిథిగా పాల్గొంటుంటారు. అయితే తన తండ్రి కృష్ణగారు నటించిన ''శ్రీశ్రీ'' ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా మహేష్బాబు వస్తుండటం మొదటిసారి కాగా, ఈ వేడుక ఓ ప్రత్యేకతతో నిలిచిపోతుంది. అలాగే సినిమా కూడా ఓ అర్ధవంతమైన సినిమాగా అన్ని వర్గాలకు జనరంజకమయ్యే విధంగా ఉంటుంది.ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలవుతున్నాయి...అని అన్నారు.
ఈ ప్రత్యేక కార్యక్రమానికి దర్శకరత్న దాసరి నారాయణరావు, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, ప్రముఖ దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి, రెబల్స్టార్ కృష్ణంరాజు, విక్టరీ వెంకటేష్ మొదలగు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. సూపర్స్టార్ కృష్ణ, శ్రీమతి విజయనిర్మల, నరేష్, సాయికుమార్, పోసాని కృష్ణమురళి, ఎల్బీశ్రీరామ్, తోటపల్లి మధు, దేవదాస్ కనకాల, మురళీశర్మ, కునాల్ కౌశిక్, శ్రీమతి అనితాచౌదరి, సోఫియా మొదలగువారు నటించిన ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్గా పతాక సన్నివేశాల్లో హీరో సుధీర్బాబు ఒక ప్రత్యేకమైన పాత్రను చేశారు.