ప్రేమ పెళ్ళికి పెద్దలు అంగీకరించరని స్కూల్లో ఆ పనిచేసిన ప్రేమజంట...

శుక్రవారం, 17 మే 2019 (14:58 IST)
వారిద్దరి కులాలు వేరు.. పైగా, ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని భావించారు. కానీ, తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరని వారు చదువుకున్న పాఠశాలలోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా లకుడారం గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రామానికి చెందిన ముంజె కనకయ్య (21), రాచకొండ తార (19) అనే యువతీ యువకులు స్థానికంగా ఉండే పాఠశాలలో తొమ్మిదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత వివిధ కారణాలతో ఇద్దరూ స్కూలు మానేశారు.
 
ప్రస్తుతం కనకయ్య కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే, తారతో కనకయ్య ప్రేమలో పడ్డాడు. కానీ, రెండేళ్ల క్రితం వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో యువతి తల్లిదండ్రులు గ్రామంలో పంచాయితీ నిర్వహించారు. ఈ సందర్భంగా కనకయ్య కుటుంబానికి పంచాయితీ పెద్దలు రూ.30 వేల జరిమానా విధించారు. ఈ ఘటన తర్వాత మళ్లీ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
 
అయితే, ఇద్దరివీ వేర్వేరు కులాలు కావడంతో తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరని గ్రహించారు. కానీ, ఒకరిని వదిలి ఒకరు ఉండలేరనీ తెలుసుకున్నారు. దీంతో కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. బుధవారం ఇద్దరూ తాము చదువుకున్న పాఠశాలకు వచ్చి పురుగుల మందు తాగారు. అనంతరం తరగతి గదిలో ఒకే కొక్కానికి ఉరివేసుకుని ప్రాణం తీసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు... అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు