చిరంజీవి - వినాయక్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం "ఖైదీ నంబర్ 150". ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం కథ గురించి వినాయక్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం సుమారు 50 కథల వరకు విన్నారని, కానీ, వాటలో ఏ ఒక్కటీ ఆయనకు నచ్చలేదన్నారు. కానీ, తమిళ చిత్రం కత్తి చిత్రం ఆయనకు నచ్చడంతో తనను పిలిచి ఓ సారి చిత్రాన్ని చూడాలని కోరారని చెప్పారు.
ఆ తర్వాత 'కత్తి' చిత్రాన్ని చూసిన తర్వాత చిరంజీవికి తగినట్టుగా తాను కొన్నిమార్పులు చేర్పులు చేయగా, ఆయన దానికి సమ్మతించారన్నారు. పిమ్మట పరుచూరి బ్రదర్స్, సత్యానంద్లతో కలిసి తెలుగు చిరంజీవికి తగినట్టుగా తయారు చేశామన్నారు. అయితే, ఈ చిత్రంలో బ్రహ్మానందం ఉండాలని కోరారని, దీంతో బ్రహ్మీ కోసం ఓ చిన్న క్యారెక్టర్ను రూపొందించినట్టు చెప్పారు.
ఇకపోతే.. చిత్ర బడ్జెట్ గురించి తనకు పెద్దగా అవగాహన లేదన్నారు. రామ్ చరణ్ నిర్మాత కావడంతో ఎక్కడ కూడా ఇబ్బందిపడలేదని వినాయక్ చెప్పారు. ఏది అడిగిన మరుసటిరోజు ఉదయం సెట్లో ఉండేదని గుర్తు చేశారు. అలాగే ఈ చిత్రం హీరోయిన్గా తొలుత అనుష్కనే అనుకున్నామనీ, కానీ, ఆమె డేట్స్ కుదరక కాజల్ అగర్వాల్ను తీసుకున్నట్టు ఆయన వివరించారు.