చెన్నైలో "హిందూ మెట్రో ప్లస్" నాటకోత్సవం

చెన్నై నగరంలోని చేట్‌పట్ లేడి వెల్లింగ్టన్ పాఠశాలలో హిందూ మెట్రో ప్లస్ నాటకోత్సవాలు ఏడో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఏడో సంవత్సర హిందూ మెట్రో ప్లస్ నాటకోత్సవాలు లేడి వెల్లింగ్టన్ పాఠశాలలోని సర్ ముత్తా వెంకట సుబ్బారావు ఆడిటోరియంలో శుక్రవారం నుంచి ఆరంభమవుతాయి. ఏడో తేదీ నుంచి 16వ తేదీ వరకు జరిగే ఈ నాటకోత్సవాల్లో భాగంగా.. ప్రతిరోజు రాత్రి 7.15 నిమిషాలకు కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఇందులో ముంబై, చెన్నై, అమెరికా, కొరియా వంటి దేశాలకు చెందిన నాటక బృందాలు పాల్గొంటాయి.

దాదాపు రెండు గంటల సేపు ఈ నాటకాలను నిర్వహిస్తారని హిందూ మెట్రో ప్లస్ ఇక్కడ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. నాటకాలను ప్రారంభించేందుకు ముందుగా సంగీత కార్యక్రమాలుంటాయి. ఇంకా ఈ నాటకోత్సవాల్లో పాల్గొనే ప్రేక్షకుల తినుబండరాల కోసం ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. వివిధ రకాలకు చెందిన ఆహార పదార్థాలుండే ఈ ఫుడ్ కోర్టుకు ప్రవేశ రుసుముగా రూ.350 నుంచి రూ.600 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

అలాగే సీజన్ టిక్కెట్లు రూ. 1,750 నుంచి మూడువేల వరకు చెల్లించాల్సి వస్తుందని మెట్రో హిందూ ప్లస్ ఆ ప్రకటనలో వెల్లడించింది. ఈ నాటకోత్సవాల టిక్కెట్ల కోసం ది హిందూ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇంకా ల్యాండ్‌మార్క్, నాటకోత్సవాలు జరిగే ఆడిటోరియం, మౌంట్‌రోడ్డులోని ఇండియా గ్యారేజ్‌లలో టిక్కెట్లను పొందవచ్చు.

వెబ్దునియా పై చదవండి