వినాయకుడు చిత్రానికి కొనసాగింపుగా "విలేజ్లో వినాయకుడు" చిత్రం తీసినట్లుంది. వినాయకుడులో కథ, కథనం, సంభాషణలు ఆసక్తి కలిగించాయి. ఆ కోవలో వెళ్ళినదే అయినా కథాగమనంలో అంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోవడం మైనసే.
కథాపరంగా చెప్పాలంటే.. కార్తీక్ (కృష్ణుడు) హైదరాబాద్లో కిండర్గార్డెన్ టీచర్. అక్కడే మెడిసిన్ చదువుతున్న కావ్య (శరణ్యామోహన్)కు తొలిచూపులోనే ప్రేమించేస్తాడు. (ఎలా ప్రేమించాడు అన్నది చూపించకుండా కేవలం డైలాగ్స్తో చెప్పేస్తాడు) వీరిద్దరూ కలిసి సరదాగా కాలక్షేపం చేస్తుంటారు. కార్తీక్ను కావ్య ముద్దుగా చిన్నూ అని పిలుస్తుంటుంది.
మెడిసన్ తర్వాత ప్రాక్టీస్ చేసి కావ్య ఫుల్ఫ్లెడ్జ్ డాక్టర్ అవుతుంది. దీంతో తన ప్రేమగురించి వారి తల్లిదండ్రులకు చెప్పమని కార్తీక్ అంటాడు. అది ఉభయగోదావరి జిల్లాలోని అందమైన ప్రాంతం రాజోలులో కావ్య తండ్రి రిటైర్డ్ కన్నల్ లక్ష్మీపతిరాజు (రావురమేష్)... తమ్ముడు, చెల్లెలు, ఫ్యామిలితో కలిసిమెలసి ఉంటాడు.
లక్ష్మీపతిరాజుది.. అంతా మిలట్రీ రూల్స్. ప్రతీదీ మెజర్మెంట్స్వేసి చూస్తుంటాడు. లక్ష్మీపతిరాజు తమ్ముని కూతురు ప్రియ నిశ్చితార్థానికి కావ్య వస్తుంది. అదేటైమ్లో తన ప్రేమను తండ్రికి చెప్పడానికి ప్రయత్నించి సాహసించలేకపోతుంది.
అయితే వదిన, అన్నలకు మాత్రం చెబుతుంది. లక్ష్మీపతిరాజు అంటే ఆ ఊరిలో ఎంత గౌరవమో, ఇంట్లో అందరికీ అంత భయం. లక్ష్మీపతిరాజు కుటుంబ స్నేహితుడు భాస్కర్ (యండమూరి వీరేంద్రనాథ్). లక్ష్మీపతిరాజు అల్లుడిగా భాస్కర్ 20మందిని ఎంపికచేసి ఫోటోలు పంపిస్తే ప్రతీదీ ఏదో నెపంతో రావురమేష్ తిరస్కరిస్తుంటాడు.
WD
ఆ టైమ్లో హఠాత్తుగా కార్తీక్ వచ్చి వాలతాడు. ఇక్కడ వాతావరణం చూసి తట్టుకోలేక తానే డైరక్ట్గా లక్ష్మీపతిరాజుతో తన ప్రేమగురించి చెప్పేస్తాడు. అంతే.. ఒక్కసారిగా కార్తీక్ వాలకం, పర్సనాలిటీ చూసి అసహ్యించుకుని అతన్ని వెళ్ళగొట్టడానికి భాస్కర్ చేత లక్ష్మీపతి ప్రయత్నాలు చేయిస్తాడు. ఆఖరికి ఆ ప్రయత్నాలు ఏమయ్యాయి? కావ్య ప్రేమ ఫలించిందా? అనేది మిగిలిన సినిమా.
విశ్లేషణ: కథాపరంగా ప్రతి పాత్ర బాగానే చేశారు. పరిమిత నటీనటులతో పరిమిత బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం మొదట్లో ఆసక్తికరంగానే సాగుతుంది. టైటిల్ నుంచి చక్కటి టైన్డ్రాయింగ్తో దర్శకుడు తీసుకున్న జాగ్రత్తలు కొత్తగా ఉంటాయి.
కార్తీక్గా కృష్ణుడు తన పాత్రమేరకు బాగానే చేశాడు. అమాయకత్వం, ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం. ఏమీ తెలియనట్లు బెల్లతనం చూపించడం అనేవి ముఖకవళికల్లో ఉట్టిపడుతాయి. వినాయకుడు తరహాలోనే కృష్ణుడు నటన ఉంటుంది. కావ్య పాత్రలో శరణ్యామోహన్ తొలిసారిగా తెలుగుకు పరిచయమైన నటి.
చాలా చిన్నవయస్సులో ఆమె సందర్భానుసారంగా పలికిన హావభావాలు ప్రేక్షకుడిని కథలో లీనంచేస్తాయి. రావు రమేష్ పాత్ర ఊరిపెద్దగా, ఇంటిపెద్దగా బాగానే ఉంది. మిగిలిన వారంతా కొత్తవారే. యండమూరి వీరేంద్రనాథ్ పాత్ర కాస్త నవ్వు, కాస్త పజిల్గా ఉంటుంది. అందరిపై పజిల్స్వేసి చివరికి తనకు కార్తీక్వేసిన పజిల్తో తికమకపడతాడు.
సాహిత్యపరంగా వనమాలి బాగా రాశాడు. "చినుకై వరదై సెలయేటి తరగై...", నీలిమేఘమా అంత వేగమా.. ఓ నిముషం ఆగుమా.." అని సాగే పాటలు మెలోడి ఆస్వాదించేట్లుగా ఉంది. బాణీలు మణికంఠ కాద్రి బాగానే చేశాడు. పల్లెటూరి అందాలు మామూలుగానే బాగుంటాయి. వాటిని రామ్ బాగానే చిత్రీకరించాడు.
ప్లస్ పాయింట్స్: కృష్ణుడు బాడీ లాంగ్వేజ్కు సరైన కథ, హీరోయిన్ అభినయం, రావురమేష్ ఫీలింగ్స్, యండమూరి చమక్కులు, తూర్పురామాయణం పేరుతో మన రామాయణాన్ని వెటకారం చేస్తూంటే.. మన తల్లిదండ్రులపై సెటైర్లు వేయగలమా? అని కృష్ణుడు ప్రశ్నించి అందరిని ఆలోచింపజేసే విధానం, పాటలు, సంగీతం, కెమెరా, లైన్డ్రాయింగ్, వెదురుబొంగులో చికెన్ను తయారుచేసే పద్ధతి, పెద్దలు పెళ్ళిచేసుకోమని ఒత్తిడితెచ్చినా మనకంటూ ఉన్న ఎయిమ్ను ఎలా సాధించుకోవాలో లక్ష్మీపతిరాజు కుటుంబంలోనివారికి కృష్ణుడు చెప్పే విధానం.
చివరిగా చెప్పాలంటే.. కొత్త తరహా కథల నేపథ్యంలో వస్తోన్న చిత్రమిది. ప్రవాసాంధ్రులు అయిన యువత తమ మనోభావాలకు తగినట్లు చిత్రాలను తీస్తూ ఓవర్సీస్ మార్కెట్ కోసం తీసే సినిమాలో కోవలోనిదే ఈ "విలేజ్లో వినాయకుడు".
పరిమిత బడ్జెట్లో పరిమిత కథాంశంతో తీసిన సినిమా ఇది. అగ్రహీరోలు, భారీతారాగణం, వేస్టేజ్ ఖర్చుల్లేకుండా సింపుల్గా సినిమా తీయవచ్చు అనేందుకు ఈ చిత్రం మంచి ఉదాహరణ, మల్టీఫ్లెక్స్ థియేటర్లకు పోషణగా ఇటువంటి చిత్రాలుంటాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు.