వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ.. నా తమ్ముడు 'కొమరం భీమ్'

గురువారం, 22 అక్టోబరు 2020 (13:22 IST)
"బాహుబలి" చిత్రం తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి నిర్మిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలు. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం సుమారు రూ.350 కోట్ల మేరకు ఖర్చు చేయనున్నారు. ఎంఎం కీరవాణి సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. అయితే, హీరోయిన్ల విషయంపై గందరగోళం నెలకొంది. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో చెర్రీ నటిస్తుంటే, మన్యం బిడ్డ కొమరం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్‌లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. 
 
అయితే, ఈ చిత్రంలోని హీరోల పాత్రలను పరిచయం చేస్తూ దర్శకుడు రాజమౌళి టీజర్‌ను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే చెర్రీ పాత్రకు సంబంధించిన అల్లూరి సీతారామారాజు టీజర్‌ను రిలీజ్ చేయగా, గురువారం ఎన్టీఆర్‌కు సంబంధించిన కొమరం భీమ్ టీజర్‌ను రిలీజ్ చేశారు.
 
నిజానికి ఈ టీజర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజున రిలీజ్ కావాల్సివుంది. కానీ, కరోనా లాక్డౌన్ కారణంగా దీన్ని వాయిదా వేశారు. దీంతో ఈ టీజర్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ వచ్చారు. ఈ క్రమంలో 11 గంటలకు ఈ టీజర్‌ను విడుదల చేస్తామని చెప్పినప్పటికీ, అరగంట ఆలస్యంగా దీన్ని విడుదల చేశారు.
 
ఈ టీజర్‌ను వీక్షిస్తుంటే రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి. "వాడు కనబడితే సముద్రాలు తడబడతాయ్.. నిలబడితే సామ్రాజ్యాలు సాగిలబడతాయ్.. వాడి పొగరు ఎగిరే జెండా.. వాడి ధైర్యం.. చీకట్లని చీల్చే మండుటెండ.. వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ.. నా తమ్ముడు.. గోండు బెబ్బులి... కొమరం భీమ్" అంటూ టీజర్‌ను కట్ చేశారు. ఈ వీడియో రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే 4.54 లక్షల మంది వీక్షించగా, 501 వేల మంది లైక్ చేశారు. 1.6 మంది డిజ్‌లైక్ చేశారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు