మూడు రాజధానులతో మంచే జరుగుతుంది.. జగన్‌కు చిరు కితాబు.. మరి పవన్?

శనివారం, 21 డిశెంబరు 2019 (18:05 IST)
మూడు ప్రాంతాల్లో రాజధాని వ్యవహారంపై జగన్ ప్రభుత్వాన్ని తమ్ముడు పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శిస్తుంటే అన్నయ్య చిరంజీవి మాత్రం జగన్ ప్రభుత్వ ప్రకటనను స్వాగతిస్తున్నారు. అధికార, పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ది సాధ్యం అని, రాష్ట్ర సర్వతో ముఖాభివృధికి ముఖ్యమంత్రి జగన్ ప్రణాళికాబద్దంగా కృషి చేస్తారన్న నమ్మకం ఉందని ప్రకటించారు.
 
అమరావతి శాసన నిర్వాహక, విశాఖపట్నం కార్యనిర్వాహక, కర్నూల్ - న్యాయపరిపాలన రాజధానులుగా మార్చే ఆలోచనను అందరం స్వాగతించాలన్నారు. సాగు, తాగు నీరు, ఉపాధి అవకాశాలు లేక ఊర్లు విడిచిపోతున్న వలస కూలీల బిడ్డల భవిష్యత్‌కు, నిరుద్యోగులకు మూడు రాజధానుల కాన్సెప్ట్ భద్రతనిస్తుందన్నారు. 
 
గత అభివృద్ధి, పాలన అంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమైందని, ఉమ్మడి రాష్ట్రంలో మిగితా ప్రాంతాలు నిర్లక్ష్యం కావడం వల్లే ఆర్థిక, సామాజిక సమతుల్యాలు దెబ్బతిన్నాయన్నారు. ఇప్పటికే మూడు లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఇంకో లక్షకోట్లు అప్పుతో అమరావతిని నిర్మిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్ధితి ఏమిటన్న ఆందోళన అందరిలో ఉందన్నారు. 
 
ఇదే సమయంలో రాజధాని రైతులలో నెలకొన్న భయాందోళనలు, అభద్రతా భావాన్ని తొలగించాలి. వాళ్లు నష్టపోకుండా, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మూడు రాజధానులపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అపోహలు, అపార్దాలు నివారించే ప్రయత్నం ప్రభుత్వం చేయాలని అన్నారు చిరంజీవి. తాజా పరిస్థితులపై మెగా అభిమానులు ఇరకాటంలో పడ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు