ఢిల్లీ నుంచి ఫోన్‌కాల్... ఫడ్నవిస్ రాజీనామా... అసలు మతలబు ఇదే?

మంగళవారం, 26 నవంబరు 2019 (18:45 IST)
సుప్రీంకోర్టు ఆదేశాలతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా తిరగబడ్డాయి. తమకు పూర్తి మెజార్టీ ఉందనీ, అసెంబ్లీ వేదికగా బలాన్ని నిరూపించుకుంటామంటూ ప్రగల్భాలు పలికిన కమలనాథులు... సుప్రీం ఆదేశాలతో తోకముడిచారు. మహా బలపరీక్షకు ఒక్కరోజు ముందే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా చేశారు. 
 
ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏమింటంటే.. బీజేపీకి అండగా ఉంటానని చెప్పిన ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్... సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువడిన కొన్ని గంటల్లోనే ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో 105 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ మరో మార్గం లేక ప్రభుత్వాన్ని త్యజించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
అంతకుముందు ఫడ్నవీస్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజీనామా విషయంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. 'రాష్ట్రానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా మేమే తీసుకుంటాం. రాష్ట్రంలోనే తీసుకుంటాం. అయితే దీనికి సంబంధించిన సమాచారాన్ని మాత్రం కేంద్రానికి వివరిస్తాం' అని అన్నారు.
 
అయితే, ఫడ్నవీస్ రాజీనామా ప్రకటన వెనుక బీజేపీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. బుధవారం సాయంత్రంలోగా బీజేపీ ప్రభుత్వాన్ని బలం నిరూపించుకోవాల్సిందిగా సుప్రీం ఆదేశించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ చీఫ్ అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాలు అత్యవసరంగా పీఎం ఛాంబర్‌లోనే అత్యవసరంగా సమావేశమయ్యారు. 
 
ఈ ముగ్గురు నేతలు సుప్రీంకోర్టు తీర్పుతోపాటు.. మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు, బలాబలాలపై విపులంగా చర్చించారు. ఈ చర్చల్లో అజిత్ పవార్ వల్ల ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు అసాధ్యమని తేల్చారు. దీంతో బలం నిరూపించుకోకుండానే తప్పుకోవాలన్న నిర్ణయం తీసుకుని, ఆ సమాచారాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు తెలియజేశారు. 
 
దీంతో ఆయన తన బాధ్యతల నుంచి తప్పుకున్నట్టు ప్రచారం సాగుతోంది. మొత్తంమీద రాత్రికిరాత్రి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించిన మోడీ - షా ద్వయం... ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పొచ్చు. దీనికి కారణం తగినంత సంఖ్యాబలం లేకపోవడమే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు