కరోనా వ్యాక్సినేషన్‌ కోసం ఏర్పాట్లు చేసుకోండి... రాష్ట్రాలకు కేంద్రం

శుక్రవారం, 8 జనవరి 2021 (08:59 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. మన దేశంలో రెండు వ్యాక్సిన్లకు అనుమతి లభించింది. ఆక్స్‌ఫర్డ్ - ఆస్ట్రాజెనికాల వ్యాక్సిన్‌తో పాటు, భారత్ బయోటెక్ తయారు చేసిన టీకాలను అత్యవసర వినియోగం నిమిత్తం వాడవచ్చని నియంత్రణా సంఘాలు అనుమతించాయి. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ఇంకా మూడవ దశ పరీక్షల ఫలితాలను వెల్లడించనందున ప్రస్తుతానికి ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ టీకానే పంపిణీ చేయనున్నారు.
 
ఈ క్రమంలో భారత్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. దేశంలోని 130 కోట్ల మందికిపైగా ప్రజలకు టీకాను అందించే దిశగా, తొలి అడుగులు పడుతున్నాయి. తొలి విడత వ్యాక్సిన్‌ను పంపుతున్నామని, దాన్ని ఫ్రంట్ లైన్ యోధులకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని తెలంగాణ, ఏపీ సహా 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రంనుంచి సమాచారం అందింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ ప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్ అడ్వయిజర్ డాక్టర్ ప్రదీప్ హల్దేర్, లేఖలను పంపారు.
 
రెండో దశలో ఇందుకు సంబంధించిన విధివిధానాలతో కూడిన సూచనలను పంపిస్తామని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలకు వ్యాక్సిన్‌సిద్ధంగా ఉండాలని అన్నారు. రిజిస్టర్ చేసుకున్న వారికి తొలుత ఇవ్వాలని, ఆ సంఖ్య ఆధారంగా ఏ జిల్లాకు ఎన్ని టీకాలు పంపాలన్న విషయమై ముందుగానే ఓ అవగాహన ఏర్పరచుకోవాలని సూచించారు.
 
మరోవైపు, శుక్రవారం కూడా మరో విడత దేశవ్యాప్త టీకా డ్రైరన్ కొనసాగనుంది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ, టీకా పంపిణీలో ఎదురయ్యే సవాళ్ల గురించి అవగాహన తెచ్చుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. నేడు 33 రాష్ట్రాల్లోని 746 జిల్లాల్లో డ్రైరన్ సాగనున్నదని, దీన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు