#HowdyMody ఉగ్రవాదం అంతు చూస్తాం.. అది ఉగ్ర కార్ఖానా : ప్రధాని మోడీ

సోమవారం, 23 సెప్టెంబరు 2019 (11:41 IST)
హ్యూస్టన్ వేదికగా జరిగిన 'హౌడీ మోడీ' కార్యక్రమంలో పాల్గొన్న ఇండో అమెరికా అధినేతలు నరేంద్ర మోడీ, డోనాల్డ్ ట్రంప్‌లో ఓ ప్రతిజ్ఞ చేశారు. ఉగ్రవాదం అంతు చూస్తామంటూ హెచ్చరించారు. పైగా, అది ఓ ఉగ్రకార్ఖానా అంటూ పాకిస్థాన్ పేరు ప్రస్తావించకుండా వ్యాఖ్యలు చేశారు. పైగా, గతంలో అమెరికా ట్విన్ టవర్స్‌పై దాడి, ముంబైపై దాడి ఎవరు చేశారంటూ మోడీ సూటిగా ప్రశ్నించారు. ఈ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులంతా ఎక్కడ ఉన్నారంటూ అడిగారు. 
 
ఈ కార్యక్రమంలో తొలుత మోడీ ప్రసంగిస్తూ, డోనాల్డ్ ట్రంప్ సాక్షింగా ఆర్టికల్ 370 రద్దును సమర్థించుకున్నారు. పాకిస్థాన్‌ పేరు ప్రస్తావించకుండానే ఉగ్రవాద అడ్డా అంటూ విమర్శలు గుప్పించారు. జమ్మూ కాశ్మీరులో ఉగ్రవాదానికి, వేర్పాటువాదానికి కారణమైన ఆర్టికల్‌ 370కి తాము చరమగీతం పాడేశామని చెప్పారు. ఇందుకు కారణమైన భారత ఎంపీలను అభినందించాలని మోడీ పిలుపు ఇవ్వడంతో.. ప్రవాస భారతీయులంతా లేచి నిలబడి కరతాళ ధ్వనులు (స్టాండింగ్‌ ఒవేషన్‌) చేశారు.
 
'ఆర్టికల్‌ 370పై భారత్‌ నిర్ణయం కొంతమందిని ఇబ్బంది పెట్టి ఉంటుంది. వాళ్లు తమ దేశాన్నే సమర్థంగా నిభాయించలేనివాళ్లు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చేవాళ్లు' అంటూ మండిపడ్డారు. పాకిస్థాన్‌ పేరు ప్రస్తావించకుండానే.. 'అమెరికాపై ఉగ్ర దాడి (9/11), ముంబై ముట్టడి (26/11) కుట్రదారులు ఎక్కడ ఉంటారు!?' అని ప్రశ్నించారు. ఉగ్రవాదంపై నిర్ణయాత్మక పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 
 
'60 ఏళ్ల తర్వాత తొలిసారిగా మరిన్ని మెజారిటీ ఓట్లతో వరుసగా రెండోసారి అధికారంలో ఉన్న ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వచ్చింది. మాతోనే మేం పోటీ పడుతున్నాం. మాకే మేం సవాళ్లు విసురుకుంటున్నాం. మా అంతట మేమే మారుతున్నాం. అందుకే, మేం అభివృద్ధి బాటలో పయనిస్తున్నాం. మేం అతి పెద్ద లక్ష్యాన్ని ఏర్పరచుకుంటున్నాం. మరింత ఎక్కువగా మేం దానిని సాధిస్తున్నాం' అని వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు