భారత్‌కు అంత సత్తావుందా? మనదేశానికి ఎన్ని మాత్రలు కావాలి?

గురువారం, 9 ఏప్రియల్ 2020 (14:13 IST)
ప్రపంచం మొత్తం ఇపుడు భారత్ వైపు చూస్తోంది. కరోనా కోరల్లో చిక్కుకున్న ప్రపంచ దేశాలన్నీ... ఈ వైరస్‌కు మందుకనిపెట్టే పనిలో నిమగ్నమయ్యాయి. అయితే, కొంతలో కొంతగా భారత్ వద్ద ఉన్న హైడ్రాక్సీక్లోరోక్వీన్ అనే మాత్రలు కరోనా వైరస్‌ను చంపేందుకు పని చేస్తుందని ఫ్రెంచ్ దేశంలో జరిగిన ఓ అధ్యయనం తెలిపింది. దీంతో ఈ హెచ్.సి.క్యూ మాత్రల కోసం ప్రపంచ దేశాలన్ని భారత్‌ను సాయం కోరాయి. 
 
అయితే, ప్రపంచానికి సరిపడ మాత్రలు సరఫరా చేసే శక్తి భారతదేశానికి ఉందా అనే విషయాన్ని పరిశీలిస్తే, ప్రస్తుతం మన ఫార్మాకంపెనీలు నెలకు 4 టన్నుల హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలను ఉత్పత్తి చేస్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో మార్చిలో ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని 10 టన్నులకు పెంచాయి. ఏప్రిల్‌లో 40 టన్నులకు, మేలో 70 టన్నులకు పెంచే ప్రయత్నంలో ఉన్నాయి. 
 
అయితే, ఇపుడు ఈ మాత్రలను ప్రపంచ దేశాలన్ని భారీ మొత్తంలో దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలో 130 కోట్ల మంది జానాభా కలిగిన భారత్‌కు ఏ మేరకు ఈ మాత్రలు అవసరమవుతాయన్న అంశంపై వైద్యులు స్పందిస్తూ, సాధారణంగా ప్రతి ఏడు కోట్ల మందికి పది కోట్ల మాత్రలు సరిపోతాయిని చెపుతున్నారు. 
 
ఈ లెక్కన ఏప్రిల్‌, మే నెలల్లో మనదేశంలో 110 టన్నుల హెచ్‌సీక్యూ ఉత్పత్తి అవుతుంది. మనకు కావాల్సింది కేవలం 10 టన్నులే. మిగతా 100 టన్నుల ఔషధ డోసులను విదేశాలకు ఎగుమతి చేయనున్నారు. 100 టన్నులంటే దాదాపు 50 కోట్ల ట్యాబ్లెట్లు (200 మిల్లీగ్రాములు). 
 
ఔషధ ఉత్పత్తిని ఇప్పటికే వేగం చేశారు. కాబట్టి మన అవసరాలకే కాదు విదేశాలకు ఎగుమతి చేయగలిగే సామర్థ్యం మన ఫార్మా కంపెనీలకు ఉంది. అందుకే ఈ మాత్రలను అగ్రరాజ్యాలైన అమెరికా, ఇటలీ, స్పెయిన్‌, ఫ్రాన్స్, జర్మనీ, మన పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్‌ వంటివాటికి సరఫరా చేసే అవకాశం ఉంది. కానీ, దాయాది దేశం మాత్రం ఈ మాత్రల విషయంపై ఇప్పటివరకు భారత్‌ను సంప్రదించకపోవడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు