రక్తపింజరి కాటుకు చావలేదనీ... నాగుపాముతో భార్యను చంపేశాడు.. ఎక్కడ?

సోమవారం, 25 మే 2020 (16:49 IST)
ఓ కిరాతక భర్త కట్టుకున్న భార్య చంపేశాడు. అదీకూడా పక్కా పాము స్కెచ్‌తో. తన ప్రణాళికలో భాగంగా తొలుత రక్తపింజరి పాముతో చంపాలని ప్రయత్నించాడు. కానీ, ఆ ప్లాన్ సక్సెస్ కాలేదు. దీంతో ఈ దఫా నాగుపాముతో తన స్కెచ్‌ను పక్కాగా అమలు చేశాడు. ఇంతకీ భార్యను చంపడానికి గల కారణం.. అదనపు కట్నం తీసుకునిరాకపోవడమే. ఈ దారుణం కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కొల్లా జిల్లా అంచల్ పట్టణానికి చెందిన సూరజ్, ఉత్రా అనే దంపతులు ఉన్నారు. ఇందులో సూరజ్ ఓ ప్రైవేటు బ్యాంకులో పని చేస్తున్నాడు. అయితే, గత కొంతకాలంగా భార్యను అదనపు కట్నం కోసం వేధించసాగాడు. అప్పటికీ ఆమెలో చలనం లేదు. ఎంతో ఒత్తిడి తెచ్చినా ఫలితం లేదు. దీంతో భార్యను తెలివిగా చంపేయాలని ప్లాన్ వేసుకున్నాడు. 
 
తన ప్లాన్‌లో భాగంగా గత మార్చి నెలలో ఓ వ్యక్తి నుంచి రూ.10 వేలు చెల్లించి రక్తపింజరి పామును కొనుగోలు చేసి, దాన్ని ఎవరికీ తెలియకుండా బెడ్రూమ్‌లో వదిలాడు. ఆ పామును చూసి హడలిపోయిన ఉత్రా దాన్నుంచి తప్పించుకునే క్రమంలో కాటుకు గురైంది. దాంతో ఆమెను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొంది క్షేమంగా బయటపడింది. 
 
అయితే, ఈసారి సూరజ్ నాగుపామును తెప్పించాడు. పుట్టింట్లో ఉన్న ఉత్రా నిద్రపోతున్న గదిలో ఆ విషసర్పాన్ని వదిలాడు. ఆ పాము ఉత్రాను కాటేయడంతో ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఈసారి అదృష్టం ముఖం చాటేసింది. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఉత్రా ప్రాణాలు విడిచింది.
 
తన కుమార్తెను రెండు సార్లు పాము కరవడంపై అనుమానం వచ్చిన ఉత్రా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె భర్త సూరజ్‌ను, అతడి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అతడి తెలివికి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారట! కొసమెరుపు ఏంటంటే.. పెళ్లి సమయంలో 98 కాసుల బంగారంతో పాటు.. లక్షలాది రూపాయలను వరకట్నంగా సూరజ్ తీసుకున్నాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు