నిర్భయ దోషులకు ఉరి తేదీ ఖరారు? మహిళా సంఘాల ఒత్తిడే కారణమా?

సోమవారం, 9 డిశెంబరు 2019 (14:57 IST)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు ఇంతవరకు శిక్షపడలేదు. కానీ, దిశ కేసులోని నిందితులను మాత్రం ఎన్‌కౌంటర్ చేశారు. దీంతో నిర్భయ కేసులోని దోషులకు కూడా తక్షణం ఉరిశిక్షలను అమలు చేయాలన్న డిమాండ్లు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా మహిళా సంఘాలు తీవ్రమైన ఒత్తిడి చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈనెల 16వ తేదీన (సోమవారం) ఉదయం 5 గంటలకు నలుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తున్నట్లు తీహార్ జైలు అధికారులు తెలిపినట్లు వార్తలు వెలువడుతున్నాయి. 
 
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. ప్రస్తుతం వారున్న తీహార్‌ జైలులోనే వారిని ఉరి తీయనున్నట్లు తెలిసింది. ఈ మేరకు జైలు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కాగా దోషుల్లో ఒకరైన వినయ్‌ శర్మ రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆయన మెర్సీ పిటిషన్‌ను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తిరస్కరించారు. దీంతో నిర్భయ దోషులకు ఉరితీసే అంశంపై లైన్ క్లియర్ అయింది.
 
కాగా 2012 డిసెంబర్‌ 16వ తేదీన ఆరుగురు కలిసి నిర్భయను అత్యంత దారుణంగా అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. అయితే ఆమెపై ఈ ఘాతుకానికి పాల్పడిన డిసెంబర్‌ 16వ తేదీనే నలుగురు దోషులను ఉరి తీస్తుండటం విశేషం. దోషుల్లో ఒకరు జూవైనల్‌ కస్టడీలో ఉండగా.. మరో దోషి రాంసింగ్‌ జైలులోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు