#ResignModi ట్విట్టర్‌లో మోత : ప్రజారోగ్యంపై శ్రద్ధలేదంటూ...

మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (08:24 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపుచేయలేనంతగా పెరిగిపోయింది. మరోవైపు నిరుద్యోగ భూతం విలయతాండవం చేస్తోంది. దీంతో ప్రధాని నరేంద్ర మోడీపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కరోనాను అదుపు చేయడంలో ప్రధాని మోడీ దారుణంగా విఫలమయ్యారని ఆరోపించారు. అస్సలు ఆయనకు ప్రజారోగ్యంపై ఏమాత్రం శ్రద్ధలేదంటూ పేర్కొంటున్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ కలిగిన మోడీకి ట్విట్టర్‌లో ఈ స్థాయిలో నిరసన సెగ తగలడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
 
గతేడాది ఆగస్టులోనూ మోడీపై సోషల్ మీడియా మండిపడింది. ఆయన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో జేఈఈ, నీట్ గురించి మాట్లాకపోవడంపై సోషల్ మీడియా విరుచుకుపడింది. ఆయన ప్రసంగ వీడియోకు డిస్‌లైక్‌లతో తమ నిరసన తెలిపారు. ఆ వీడియోకు 74వేల లైక్‌లు వస్తే ఏకంగా 5 లక్షల మంది డిస్‌లైక్ చేశారు. తాజాగా #ResignModi ట్విట్టర్‌లో ఇపుడు టాప్ ట్రెండింగ్‌లో ఉంది. 
 
తాజాగా, ఉద్యోగాలు కావాలంటూ నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. ‘మోదీ రోజ్‌గార్ దో’, ‘మోడీ ఉద్యోగమివ్వు’ వంటి ట్వీట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఒక్క రోజులోనే ఇలాంటి ట్వీట్లు ఏకంగా 50 లక్షలు రావడం గమనార్హం. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానంటూ ఇచ్చిన హామీ ఏమైందని నిలదీస్తున్నారు. 
 
ముఖ్యంగా ప్రస్తుతం కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ, ప్రభుత్వ తీరును నిరసిస్తూ ట్విట్టర్‌ను హోరెత్తిస్తున్నారు. మోడీకి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో కరోనా మృతదేహాలను రహస్యంగా కాల్చివేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ దాదాపు మూడు లక్షల ట్వీట్లు రావడం గమనార్హం. 
 
మరోవైపు, దేశంలో కరోనా పెరుగుదలకు మోడీనే కారణమని ఆరోపిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజ్‌ప్రతాప్ యాదవ్ సహా మరికొందరు నేతలు రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ.. ప్రధాని మోడీ మాత్రం కించిత్ కూడా స్పందించడం లేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు