శ్రావణి ఆత్మహత్య కేసు: వాళ్లిద్దరూ అరెస్ట్, ఆర్‌ఎక్స్‌-100 నిర్మాత అశోక్‌ రెడ్డి పరారీ

సోమవారం, 14 సెప్టెంబరు 2020 (18:29 IST)
బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు ఓ కొలిక్కి వచ్చింది. మొత్తం ముగ్గురుని ఈ కేసులో నిందితులుగా తేల్చారు పోలీసులు. కాగా శ్రావణి సూసైడ్ కేసులో నిందితులైన దేవరాజ్‌ రెడ్డి, సాయిరెడ్డిని అరెస్టు చేసి వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్యపరీక్షలు చేసిన తర్వాత వెస్ట్‌ జోన్‌ డీసీపీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు.
 
కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ మీడియాకు వివరించారు. 2012లో శ్రావణి టీవీ సీరియళ్లలో పనిచేయాలని హైదరాబాద్‌ నగరానికి వచ్చింది. ఆ క్రమంలో ఆమెకి 2015లో సాయి కృష్ణారెడ్డితో పరిచయం ఏర్పడింది. ఇదిలావుండగా మధ్యలో ఆర్ఎక్స్ -100 నిర్మాత అశోక్ రెడ్డి ఆమెకి పరిచయమయ్యారు.
 
ఈ పరిచయం ఇలావుండగానే 2019లో దేవరాజ్‌ రెడ్డితో శ్రావణికి పరిచయం కలిగింది. ఇలా పరిచయమైన వీరు ముగ్గురూ శ్రావణిని పెళ్లాడుతామంటూ వేధించారు. శ్రావణికి దగ్గరవుతున్న దేవరాజ్‌ను దూరంగా పెట్టాలని సాయి చాలాసార్లు ఆమెతో గొడవపడ్డాడు. దేవరాజ్‌తో చనువుగా ఉండటం నచ్చని శ్రావణి తల్లితండ్రులు, సాయి అతనితో మాట్లాడకూడదని గట్టిగా హెచ్చరించారు.
 
తనను కొట్టారంటూ శ్రావణి సాయి, ఆమె తల్లిదండ్రుల గురించి దేవరాజ్‌ వద్ద మొరపెట్టుకున్నట్లు అతడు చెప్పాడు. అటు సాయి ఇటు దేవరాజ్‌ ఇద్దరూ శ్రావణిని వేధింపులకు గురిచేశారు. ఈ క్రమంలో శ్రావణి దేవరాజుపై కేసు కూడా పెట్టింది. శ్రావణికి వేరే వాళ్లతో సంబంధాలున్నాయని దేవరాజ్‌ పెళ్లికి నిరాకరించినట్లు వెల్లడించాడు. ఇలా అందరి చేతుల్లో మోసపోయిన శ్రావణి తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నాం.
 
కేసు దర్యాప్తు అనంతరం ఏ1 నిందితుడిగా సాయి కృష్ణారెడ్డి, ఏ2గా అశోక్‌ రెడ్డి, ఏ3గా దేవరాజ్‌ రెడ్డిలుగా గుర్తించాం. ఈ ముగ్గురిలో ఇప్పటికే దేవరాజ్‌ రెడ్డి, సాయి కృష్ణారెడ్డిలను అరెస్టు చేయడం జరిగింది. ఆర్‌ఎక్స్‌-100 నిర్మాత అశోక్‌ రెడ్డి పరారీలో ఉన్నారు. అతడిని అరెస్ట్‌ చేయాల్సి ఉందని డీసీపీ వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు