పరిమితికి మించి "పసిడి" ఉందా.. అయితే పన్ను బాదుడే... మోడీ సర్కారు నిర్ణయం?

గురువారం, 31 అక్టోబరు 2019 (06:47 IST)
దేశంలోని ప్రతి ఒక్కరికీ ప్రీతిపాత్రమైనది బంగారం. బంగారం అంటే ఇష్టపడనివారంటూ ఉండరు. పేదల నుంచి కోటీశ్వరుల వరకు ప్రతి ఒక్కరికీ ప్రియమైనది బంగారం. మరి అలాంటి బంగారంపై ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. పరిమితికి మించి బంగారం ఉన్నట్టయితే పన్ను చెల్లించేలా చట్టం తీసుకునిరానుంది. దీనికి బలమైన కారణం లేకపోలేదు. 
 
గత 2016 నవంబరు ఎనిమిదో తేదీన దేశంలో పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేశారు. దీంతో నల్లధనాన్ని బంగారం రూపంలోకి మార్చడం ఎక్కువైపోయింది. ఇపుడు మోడీ కన్ను ఈ బంగారంపై పడింది. మీ వద్ద బంగారం ఉందో చెప్పాలి అనే కొత్త నిబంధనను తీసుకురానుంది. ఇందుకోసం స్వచ్ఛంధ వెల్లడి పథకాన్ని ప్రవేశపెట్టనుంది. 
 
నిర్దిష్ట గడువు ప్రకటించి ఆ లోపు ప్రతి ఒక్కరూ తమ వద్ద నిల్వ ఉన్న బంగారం వివరాలు బయటపెట్టాలని స్పష్టం చేస్తుంది. పరిమితికి మించి ఉన్న బంగారంపై పన్ను విధించి 'అమ్నెస్టీ’(సార్వత్రిక క్షమాభిక్ష) కింద శిక్షించకుండా వదిలేస్తుంది. ఆ తర్వాత కొరఢా విదిలిస్తుంది. లెక్కల్లో చూపించని బంగారంపై భారీ జరిమానా విధిస్తుంది.
 
అంతేనా, కొత్తగా కొన్న బంగారు కొనుగోళ్ల వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చెప్పాల్సి ఉంటుంది. రసీదు లేకుండా బంగారం కొంటే భారీ జరిమానాలు తప్పవు. ఒక్కొక్కరు గరిష్టంగా ఎంత స్వర్ణం ఉంచుకోవచ్చు, పరిమితికి మించిన బంగారాన్ని స్వచ్ఛందంగా బయటపెడితే ఎంత పన్ను విధిస్తారు, 'అప్రకటిత' బంగారంపై విధించే జరిమానా ఎంత? ఈ వివరాలను నిర్ధారించాల్సి ఉంది. ఆర్థిక వ్యవహారాలు, ఆదాయ పన్ను శాఖలు సంయుక్తంగా ప్రతిపాదనలు రూపొందించాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు